విశాఖలో 22 ఎకరాలలో కాగ్నిజెంట్ క్యాంపస్,  AIలో ఉద్యోగాల కల్పన
x

విశాఖలో 22 ఎకరాలలో కాగ్నిజెంట్ క్యాంపస్, AIలో ఉద్యోగాల కల్పన

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని లోకేష్ వెల్లడి


విశాఖ పట్నం భవిష్యత్ ఐటీ హబ్ గా మారేందుకు అడుగులు పడుతున్నాయి.ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ విశాఖలో తమ నూతన క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నంను ఎంచుకున్న కాగ్నిజెంట్ , కాపులుప్పాడ ప్రాంతంలో సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో కూడిన ఐటీ క్యాంపస్‌ను నిర్మించనున్నట్లు తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా వెల్లడించింది.

ఈ కొత్త క్యాంపస్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ (Digital transformation) వంటి భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాల విభాగాల్లో ప్రధానంగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు కాగ్నిజెంట్ తెలిపింది.2026 సంవత్సరం నుంచి విశాఖ క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సంస్థ పేర్కొంది. తమకు సహకారం అందించిన సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌లకు కాగ్నిజెంట్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది.ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 8,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.దీంతో విశాఖపట్నం ఐటీ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.
పెట్టుబడులు పెట్టే సంస్థలకు సహకరిస్తాం-లోకేష్
విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ రానుండటం పట్ల ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తంచేశారు.ఎక్స్ వేదికగా కాగ్నిజెంట్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న అన్న సంస్థలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. "తమ భవిష్యత్తు కార్యకలాపాలకు విశాఖను ప్రధాన కేంద్రంగా ఎంచుకున్న కాగ్నిజెంట్‌కు ధన్యవాదాలు. సన్‌రైజ్ రాష్ట్రానికి స్వాగతం" అంటూ ఆయన తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేశ్ స్పష్టం చేశారు.స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More
Next Story