వ్యవసాయానికి అవసరమైన ఆధునిక సాగు యంత్ర పరికరాల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సాగు వ్యయం తగ్గేలా ఆధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులోకి తేవాలని వ్యవసాయ శాఖకు సీఎం దిశానిర్దేశం చేశారు. బుధవారం సచివాలయంలో ధాన్యం, పత్తి, మిర్చి సహా వివిధ వాణిజ్య పంటల కొనుగోళ్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. శాస్త్రీయ విధానంలో పంటల సాగు ప్రణాళిక, వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు, డ్రోన్ల వినియోగం ద్వారా సాగు వ్యయం తగ్గించాలని తద్వారా రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను ప్రారంభించి పరికరాల వివరాలు తెలిపేలా సమాచారం ఉంచాలన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం కొనుగోళ్లతో పాటు వివిధ పంటల కొనుగోళ్లు, మార్కెటింగ్ పై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు, వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలని సూచించారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకూ 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. మొత్తం 2,606 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని.. 7.39 కోట్ల గోనె సంచులు కూడా రైతులకు అందుబాటులో ఉంచినట్టు వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రూ.4,085 కోట్ల మేర రైతులకు చెల్లింపులు చేసినట్టు సీఎంకు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 32 శాతం అధికంగా కొనుగోళ్లు జరిగినట్టు తెలియచేశారు. దీనిపై స్పందించిన సీఎం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎన్డీఎ ప్రజాప్రతినిధులు అంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా నిలబడాలని సూచించారు. రబీ సీజన్ లో ప్రజలు తినే వెరైటీ వరి సాగుతో పాటు వాటి కొనుగోలు, అంతర్జాతీయంగా మార్కెటింగ్ పై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రాగులు, జొన్న, సజ్జ లాంటి చిరు ధాన్యాల పంటలను సేకరించి వినియోగదారులకు అందుబాటులో ఉంచాలన్నారు.
పత్తి కొనుగోళ్లపై కేంద్రానికి లేఖ
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లకు సంబంధించిన స్లాట్లు కేటాయింపు, ఇతర సాంకేతిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని సీసీఐ అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి పత్తి కొనుగోళ్లలో సమస్యల్ని సృష్టించొద్దని సీసీఐకి సూచించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. మిర్చి లాంటి పంటలకు మార్కెట్ కల్పించే విషయంలో వివిధ విశ్లేషణా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. సాగులో శాస్త్రీయ విధానాలు అవలంబించటం ద్వారా నాణ్యమైన పంట రైతులకు అందివస్తుందని వీటిపై వారికి అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో 45,420 హెక్టార్లలో సుబాబుల్ సాగైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం మార్కెట్ కు అనుగుణంగా సుబాబుల్ రైతులకు ధర దక్కేలా చూడాలని సీఎం సూచనలు జారీ చేశారు. అరటి, నిమ్మ లాంటి ఉద్యాన పంటలకు సంబంధించి కొనుగోలు దారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
ధరలు పడిపోకుండా హార్వెస్టింగ్ రేషనలైజేషన్
కనీస మద్ధతు ధర దక్కేలా వాణిజ్య పంటల హార్వెస్టింగ్ ప్రక్రియలో రేషనలైజేషన్ విధానాన్ని పాటించాలని.. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకు రవాణా ఖర్చులు తగ్గించి అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను అనుసంధానించాలని సీఎం సూచించారు. అలాగే వివిధ ప్రాంతాల్లో పండే పంటలకు సంబంధించి ప్రొడక్ట్ క్లస్టర్ల ద్వారా పంట ఉత్పత్తి, మార్కెటింగ్ లను సమన్వయం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లి పంటకు నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహా ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.