కూటమి ప్రభుత్వంపైన, సీఎం చంద్రబాబు పైన, మంత్రి నారా లోకేష్ పైన వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి, రెండో ఏడాది అమలు చేసినా తల్లికి వందనం పథకంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ తల్లులను మోసం చేసిందని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. అడ్డగోలు నిబంధనలతో లబ్ధిదారులను భారీగా తగ్గించారని విమర్శలు గుప్పించారు. యూడైస్ రిపోర్టు మీద అబద్ధాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు.
తల్లికి వందనం పేరుతో సీఎం చంద్రబాబు తల్లికి వంచన చేశారని ధ్వజమెత్తారు. కేంద్రానికి ఇచ్చిన యుడైస్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 87,41,855 మొత్తం మంది విద్యార్థులు ఉంటే దాదాపు రూ.13,110 కోట్లు చెల్లించాలి. కానీ కేవలం రూ.8,745 కోట్లు మాత్రమే చెల్లించి, మూడో వంతు విద్యార్థులకు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం మోసగించిందన్నారు. ఇంటర్ వరకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి నిబంధనల పేరుతో పథకానికి అర్హులు కాకుండా ప్రభుత్వమే మోసగించిందని మండిపడ్డారు. దీనినై తమ పార్టీ తరఫున ప్రశ్నిస్తుంటే, టీడీపీ నాయకులు యూడైస్ రిపోర్టు మీద కూడా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు, ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక, మంత్రి నారా లోకేష్ ఎదురుదాడి చేస్తూ, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎప్పుడిస్తారో తెలియని ఫీజు రీయింబర్స్మెంట్ను అడ్డం పెట్టుకుని ఇంట్లో ఎవరైనా ఫీజు రీయింబర్స్మెంట్ అందుకున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉపకార వేతనాలు పొందుతున్నా తల్లికి వందనం పథకం అమలు చేయలేదన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పిల్లలకూ పథకాన్ని వర్తింప చేయలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అందే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ డబ్బులు మినహాయించి లబ్ధిదారుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బు జమ చేశారని, రేషన్ కార్డు లేదనే కారణంతో కూడా పథకం ఎగ్గొట్టారని దుయ్యబట్టారు.
తమ ప్రభుత్వ హయాంలో స్కూల్ నిర్వహణ కోసం అమ్మ ఒడిలో వెయ్యి రూపాయలు మినహాయిస్తే జే ట్యాక్స్ అంటూ నారా లోకేష్ విషప్రచారం చేశారని, కానీ తల్లికి వందనంలో చెప్పాపెట్టకుండా ఒక్కో విద్యార్థి నుంచి ఏకంగా రూ.2 వేలు లాగేసుకున్నారని, దీనికి మంత్రి నారా లోకేష్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నారా లోకేష్ నేతృత్వంలో విద్యావ్యవస్థ సర్వనాశనమైందన్నారు. బడులు ప్రారంభించే నాటికి బదిలీలు పూర్తి చేయలేదన్నారు. జీవో నెంబర్ 117 రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఏడాది కాలంగా రద్దు చేయలేదన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా మరో మూడు జీవోలు తీసుకొచ్చారని, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరంచెల విద్యావిధానాన్ని తీసేసి 9 అంచెల విధానాన్ని తీసుకొచ్చారని మేరుగ నాగార్జున విమర్శలు గుప్పించారు.
నాడు–నేడు ద్వారా రెండు విడతల్లో దాదాపు రూ. 12 వేల కోట్లు వెచ్చించి 38 వేల ప్రభుత్వ బడులను కార్పొరేట్కి ధీటుగా తీర్చిదిద్దితే కూటమి ప్రభుత్వం దానిని పక్కన పెట్టిందని మండిపడ్డారు. సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు, టోఫెల్ శిక్షణ, సీబీఎస్ఈ సిలబస్, 8 తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూమ్లు వంటి వినూత్న ఆలోచనతో దేశంలో ఏపీ విద్యావ్యవస్థను ఉన్నత స్థానంలో నిలబెడితే ఏడాది పాలనతోనే వాటికి ఆనవాళ్లు లేకుండా చేసేశారని ధ్వజమెత్తారు.
గోరుముద్ద పథకం కోసం ఐదేళ్లలో తమ ప్రభుత్వం రూ.7,244.60 కోట్లు వ్యయం చేసిందని, రోజుకో మెనూతో పిల్లలకు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం పెట్టామన్నారు. కానీ గోరుముద్ద కాస్త ‘ఘోర ముద్ద’గా మంత్రి లోకేష్ మార్చేశారని ధ్వజమెత్తారు. పొగాకు రైతుల పరామర్శ కోసం పోలీసుల అనుమతితో జగన్ ప్రకాశం జిల్లా పొదిలికు వెళ్తే భారీగా ప్రజలు తరలి వచ్చారని, వారిని చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు మాపై రాళ్ల దాడికి దిగితే రక్షణ కల్పించాల్సిన పోలీసులు చోద్యం చూస్తుండిపోయారని మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు.
నిరసన పేరుతో అడ్డుకోవాలని చూసిన వారికి రక్షణ కల్పించడమే కాకుండా, మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారని, చివరకు పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డికి కూడా నోటీసులిచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితుల కుటుంబాల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల దళిత విద్యార్థిని మీద 18 మంది టీడీపీ యువకులు ఆరు నెలలుగా అత్యాచారం చేసిన విషయం సాక్షి వెలుగులోకి తేవడంతో ఆ కుటుంబాన్ని ఊరి నుంచి పంపించివేశారని, ఆ బాలిక కుటుంబం టీడీపీ సానుభూతిపరులే అయినా ఆ పార్టీ నాయకులే అన్యాయం చేశారని విమర్శించారు. ఇంటర్ చదువుతున్న మరో గిరిజన విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించి దారుణంగా చంపేసినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు.