
తెలుగు భాషా బంధం..మారిషస్ అధ్యక్షుడితో ముఖ్యమంత్రి భేటీ
మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ , సీఎం చంద్రబాబు తెలుగు వారి యోగక్షేమాలపై చర్చించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అధ్యక్షుడిని, సీఎం చంద్రబాబు ఆయన బస చేసిన హోటల్లో కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రధానాంశాలు
ఏపీ అభివృద్ధిపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు, డిజిటల్ గవర్నెన్స్, రాజధాని అమరావతి నిర్మాణ విశేషాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడికి వివరించారు. మారిషస్లో స్థిరపడిన వేలాది మంది తెలుగు ప్రజల యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అక్కడ తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు మారిషస్ ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాల నెమరువేసుకున్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు మారిషస్లో పర్యటించిన సందర్భాలను ధరమ్ బీర్ గోకుల్ గుర్తు చేసుకున్నారు. తెలుగు సంస్కృతిపై ఆయనకున్న మక్కువను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు. అంతకుముందు మహాసభల వేదికపై ప్రసంగించిన అధ్యక్షుడు, మారిషస్లో తెలుగు భాషను పాఠశాలల్లో బోధించడమే కాకుండా, ఉగాదిని జాతీయ పండుగగా జరుపుకుంటామని గర్వంగా ప్రకటించారు. ఈ భేటీలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలుగు భాషాభివృద్ధికి, ఏపీ-మారిషస్ మధ్య సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇరువురు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story

