మోదీతో భేటీ అయిన చంద్రబాబు
x

మోదీతో భేటీ అయిన చంద్రబాబు

మే2న అమరావతిలో ఐదు లక్షల మందితో 250 ఎకరాల్లో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.


ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించిన సీఎం చంద్రబాబు.. పహల్గాం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆంధ్రప్రదేశ్‌ మద్దతు ఉంటుందని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజధాని అమరావతి పున్ఃనిర్మాణ పనులను ప్రారంభించేదంకు మే2న రావాలని ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.

రాజధాని అమరావతిలో రూ. లక్ష కోట్లకు విలువైన ప్రాజెక్టు పనులను ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించే విధంగా ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేశారు. మరో వైపు మే2న ప్రధాని అమరావతి పర్యటనకు సంబంధించిన ప్రణాళికలను, రోడ్‌ మ్యాప్‌లను ఇప్పటికే ఖరారు చేశారు.
గతంలో కంటే ఈ సారి అమరావతి పనుల ప్రారంభ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఆ మేరకు ఏర్పాట్లతో పాటు జనసమీకరణకు పూనుకున్నారు. భారీ ఎత్తున తరలించేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూసుకునేందుకు ఇది వరకే ఐదుగురు మంత్రులతో కూడిన ఓ కమిటీని కూడా సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు. 250 ఎకరాల్లో భారీ సభను నిర్వహించేందుకు సన్నద్ధం అయ్యారు. దీని కోసం రాష్ట్రం నలుమూలల నుంచి 5 లక్షల మంది జనాభాను ఈ సభకు తరలించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మేరకు ఆయా జిల్లాల నేతలకు ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. సభకు భారీ ఎత్తున ప్రజలను తరలించే బాధ్యతలను వారికి అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2400 బస్సులతో ప్రజలను అమరావతికి తరలించేందుకు ఉపయోగించనున్నారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న వెలగపూడి సచివాలయం వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే2న అమరావతి పునఃప్రారంభ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ. లక్ష కోట్ల పనుల ప్రారంభ సూచికగా పైలాన్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే రోడ్‌షోలో కూడా భారీ స్థాయిలోనే జనాలను పోగేయాలని కూటమి ప్రభుత్వ పెద్దలు కసరత్తు ముమ్మరం చేశారు. దాదాపు 30వేల నుంచి 40వేల మంది వరకు రోడ్‌ షోలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
Read More
Next Story