క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే!
x

క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే!

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తన మంత్రివర్గంతో కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో అనేక కీలక అంశాలపై వారు చర్చలు జరిపారు.


ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తన మంత్రివర్గంతో కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో అనేక కీలక అంశాలపై వారు చర్చలు జరిపారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో వెలుగులోకి వచ్చిన అనేక అంశాలపై తన మంత్రివర్గంతో సీఎం చంద్రబాబు చర్చించారు. పలు పథకాల అమలు, హామీల అమలుపై మంత్రివర్గం అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది క్యాబినెట్. ఈ సందర్బంగా మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు కూడా చేశారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తించాలని సూచించారు.

రీ-సర్వేపై రెవెన్యూ శాఖ కెబినెట్లో నోట్ సమర్పించింది. రీ-సర్వే వల్ల తలెత్తిన వివాదాలపై చర్చించారు. గత ప్రభుత్వ విధానం వల్ల రీ-సర్వేపై భూ యజమానుల్లో ఆందోళన ఉందని మంత్రులు వ్యాఖ్యానించారు. భూ యజమానుల్లో ఆందోళన ఉంటే గ్రామాల్లో వివాదాలు పెరుగుతాయని కేబినెట్ ఆభిప్రాయపడింది. రీ-సర్వే ప్రక్రియను అబేయెన్సులో పెట్టాలని కెబినెట్ నిర్ణయించింది. దాంతో పాటుగా పలు శాఖల గురించి చర్చించింది. ఈ వివరాలను గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడించారు.

1.సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌:

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ - 1992, సెక్షన్ 3 ప్రకారం (ఎ) క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) మరియు రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఆర్.డి.ఎఫ్) సంస్థ‌లపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగించేందుకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

వామపక్ష భావజాలం ప్రచారం చేస్తూ, ఘర్షణ వాతావరణానికి తెరతీయడం, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేకంగా, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భంగం కలిగించడం, శాాంతియుత వాతావరణానికి విఘాతం కల్గించడం, వ్యక్తులు మరియు పోలీసు సిబ్బంది హత్యలకు కారణమవుతున్న నేపథ్యంలో ఏ కేటగిరిలోని సంస్థలపై 17.8.2005 నుండి ఈ నిషేధం కొనసాగుతుంది. అదే విధంగా బి కేటగిరి లోని సంస్థలను చట్టవ్యతిరేక సంఘాలుగా గుర్తిస్తూ 9.8.2012 నుండి నిషేధం కొనసాగిస్తున్నారు.

2.ప‌శు సంవ‌ర్థ‌క, పాడి పరిశ్ర‌మాభివృద్ధి మ‌రియు మ‌త్స్య‌ శాఖ‌:

పశు సంవర్థక‌ శాఖకు సంబంధించి తేదీ.18.08.2021 నాడు జారీ చేసిన జి.ఓ.ఆర్టీ నంబర్ 217 మరియు మత్స్యశాఖకు సంబంధించి తేదీ.08.09.2020 నాడు జారీ చేసిన జి.ఓ.ఆర్టీ సంఖ్య. 144 ల రద్దు కోసం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గత 3 దశాబ్దాలుగా మత్స్యకార సంపద, సంక్షేమం కోసం నామ మాత్రపు లీజుతో ప్రభుత్వ చెరువులను మత్స్యకార సహకార సంఘాలకు ఇచ్చారు. కానీ మత్స్యకారుల హక్కులకు భంగం కలిగించేలా జీవో నెంబర్ లు 144, 217 లను గత ప్రభుత్వం జారీ చేసింది.

అందులో భాగంగా ఫైలట్ ప్రాజెక్ట్ క్రింద ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 25,380 హెక్టార్ల నీటి విస్తీర్ణంతో ఎంపిక చేసిన 27 ప్రభుత్వ చెరువులను 6592 మత్స్యకార కుటుంబాలకు చెందిన 27 మత్స్యకార సహకార సంఘాలకు కేటాయించకుండా పబ్లిక్ ఆక్షన్ వేయడం జరిగింది. ఇచ్చిన జీవోలను నిలుపుదల చేయాలని కోరుతూ ఇప్పటికే అనేక మంది మత్స్యకారులు, సంఘాలు 11 కోర్టు కేసులు ( 7 రిట్ పిటిషన్లు, 4 రిట్ అప్పీల్స్) వేసి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో ఇచ్చిన జీవోలు అమలుకు సాధ్యం కాలేదు.

అదే విధంగా సదరు జీవోలకు అనుగుణంగా “ఇన్ లాండ్ ఫిషర్ మేన్ కో ఆపరేటివ్ సొసైటీ”లను ఏర్పాటుపై ఎలాంటి స్పష్టత లేదు. తద్వారా మత్స్యకార సంఘాలకు చెరువులు కేటాయించని కారణంగా జీవనోపాధికి ఆటంకం ఏర్పడింది. మధ్యేమార్గంగా అక్రమార్కులు లబ్ధి పొందుతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు చేప పిల్లల పెంపకం నుండి మార్కెటింగ్ వరకు మద్య దళారీ వ్యవస్థ లేకుండా మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ఒక సమగ్రమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కేబినెట్ ముఖ్యమంత్రి సూచించారు.

పర్యాటక అభివృద్ధి కోణంలో కూడా ఆలోచించాలని తద్వారా ఉపాధి, ఆర్థిక ప్రగతి కలుగుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి, జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా తరువాతి కేబినెట్ కు యాక్షన్ ప్లాన్ అందించాలని సూచించారు. దీంతో సదరు 27 మత్స్యకార సంఘాలకు మేలు కలించాలని, పైన పేర్కొన్న 11 కేసులను పరిష్కరించాలనే సదుద్దేశ్యంతో సంబంధిత జీవోలను రద్దు చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. తద్వారా రాష్ట్రంలోని లక్షలాది మత్స్యకారులకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం.

3.పురపాలక పరిపాలన మ‌రియు ప‌ట్ట‌ణాభివ‌ృద్ధి శాఖ:

ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు మునిసిప‌ల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేయడం మరియు సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిప‌ల్ కార్పొరేషన్ చట్టం - 1955 మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాల్టీస్ చట్టం 1965 లో చేసిన చట్ట సవరణల రద్దు కోసం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తగ్గుతున్న పునరుత్పత్తి రేటును పరిగణలోకి తీసుకుంటూ మారుతున్న సామాజిక, ఆర్థిక అవసరాలను, జనాభా స్థిరీకరణ, జనాభా సమతౌల్యతను దృష్టిలో ఉంచుకొని సదరు నిబంధనలు ప్రస్తుత పరిస్థితులకు వర్తించనందున ఆ చట్టసవరణల ర‌ద్దుకు మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది.

జాతీయ పునరుత్పత్తి రేటు 2.1 గా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అది కేవలం 1.5 గా ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో పురుషుల పునరుత్పత్తి వయసు సగటున 32.5 కాగా 2047 నాటికి 40 ఏళ్లుకానుంది. అదే విధంగా మహిళల్లో ప్రస్తుత పునరుత్పత్తి వయస్సు సగటున 29 సంవత్సరాలు కాగా అది 2047 నాటికి 38 సంవత్సరాలు కానుంది. ఆర్థికభివృద్ధికి దోహదపడే పనిచేసే వ్యక్తుల సంఖ్య గణనీయంగా తగ్గనుంది.

అదే విధంగా ప్రస్తుతం ఏపీలో 60 ఏళ్లకు పై బడిన వ్యక్తుల సంఖ్య 11 శాతం కాగా ఇది 2047 నాటికి 19 శాతం కానుంది. ఇదే వయస్సు జాతీయ స్థాయిలో ప్రస్తుతం 10 శాతంగా ఉండగా, 2047 నాటికి 15 శాతం కానుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారిని అర్బన్ లోకల్ బాడీస్ లో అనర్హులుగా ప్రకటిస్తూ 1955, 1965, 1994 లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాలకు సవరణల ద్వారా కుటుంబ నియంత్రణ ప్రోత్సహించేలా జత చేసిన నిబంధనలను రద్దు చేసే ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.




4.పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివ‌ృద్ధి శాఖ‌:

ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయడం మరియు సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం - 1994 లోని సెక్షన్ 19 కు చేసిన సవరణను రద్దు చేసేందుకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 1980, 1990 దశకాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉన్న నేపథ్యంలో జనాభా నియంత్రణను అట్టడుగు స్థాయికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి.

ఈ క్రమంలో గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ లలో పోటీ చేసే వాళ్లకు ఏపీ పంచాయతీరాజ్ చట్టం - 1994 లోని సెక్షన్ 19 ప్రకారం ఇద్దరు పిల్లలు చాలు అని చట్ట సవరణ చేయడం జరిగింది. కానీ ఈ చట్టంను 30 ఏళ్ల పాటు అమలు పరిచిన ప్రభుత్వం సంతానోత్పత్తి రేటు, పనిచేయగల సామర్థ్యం ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్య పై నిషేధం అనవసరమని భావిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదన చేసిన ఈ సవరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

5.హెల్త్ అండ్ మెడిక‌ల్ & ఫ్యామిలీ వెల్ఫేర్:

ఫేజ్-1 క్రింద నేష‌న‌ల్ మెడికల్ క‌మిష‌న్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్ల‌తో నిర్మించిన నూత‌న వైద్య క‌ళాశాల‌ల‌కు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా 380 పోస్టుల భ‌ర్తీ చేప‌ట్టాల‌న్న ప్ర‌తిపాద‌న‌కు మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. ఫేజ్-2 క్రింద పాడేరు, మార్కాపూర్, పులివెందుల, ఆదోని, మదనపల్లె ల‌లో నిర్మించిన నూత‌న వైద్య క‌ళాశాల‌లో 2024 - 25 విద్యా సంవత్సరంకు సంబంధించి 100 సీట్ల‌తో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించడానికి అనుమ‌తి కోరుతూ చేసిన ప్ర‌తిపాద‌న‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. నేషనల్ మెడికల్ కమిషన్ నూతన నిబంధల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుజరాత్ పీపీపీ మోడల్ ను అధ్యయనం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేబినెట్ కు సూచించారు.

6.వాట‌ర్ రిసోర్సెస్:

జీవో నెంబ‌ర్. 40 రద్దు కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తేదీ: 11.05.2023 నాడు జారీ చేసిన జీవో నెంబర్ 40 ప్రకారం నంద్యాల జిల్లా సుండిపెంట (శ్రీశైలం ప్రాజెక్టు) గ్రామ పంచాయతీకి కేటాయించిన భూమిని రద్దు చేస్తూ నీటిపారుదల శాఖకు బదిలాయించే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖకు బదిలీ చేసిన 208.74 ఎకరాల భూమిలో చేప‌ట్టిన‌ నిర్మాణాలను భవిష్యత్ అవసరాల దృష్ట్యా యథాతథంగా ఉంచాలని చేసిన‌ ప్రతిపాదనను మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుపతి అధ్యాత్మిక క్షేత్రం తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా టెంపుల్ టూరిజం, రెవెన్యూ ఉన్న దేవాలయం శ్రీశైలం అని, ఈ శ్రీశైలం ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా అత్యధిక భక్తులు, పర్యాటకులు సుండిపెంట , శ్రీశైలం ప్రాజెక్టుకు, దేవాలయానికి వస్తున్న తరుణంలో ఆదాయం పెంచేందుకు, పర్యాటకాభివృద్ధికి ఈ స్థలాన్ని భవిష్యత్ లో బదలాయించాలని సూచించారు.

7.రెవెన్యూ (ఎక్సైజ్):

2014-19 మరియు 2019-24 మధ్య ఎక్సైజ్ పాలసీల (తులనాత్మక విశ్లేషణ) మరియు "వే ఫార్వర్డ్" మదింపు కోసం మంత్రుల మండలిలో చ‌ర్చ‌కు ప్రతిపాదన. 2014-19తో పోలిస్తే ప్రస్తుత పాలసీ ఫ్రేమ్‌వర్క్ లోపభూయిష్టంగా, పారదర్శకంగా లేకుండా ఉంది. పర్యవేక్షణలో అంతరాలు, విఫలమైన పునర్నిర్మాణం, నేరాలు మరియు ఆదాయ నష్టాల పెరుగుదలకు దారితీశాయి. రానున్న నెల‌న్న‌ర రోజుల్లో ఎక్సైజ్ శాఖ‌ను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీక‌ృత ప‌రిపాల‌న విధానం క్రింద‌కు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖ‌ను పున‌ర్నిర్మించేందుకు ప్రతిపాదించబడింది..

మ‌ద్యం రిటైల్ అమ్మ‌కాలు, ప్రొక్యూర్ మెంట్, క్వాలిటీ కంట్రోల్, ధ‌ర‌ల నిర్ధార‌ణ విధానాల‌కు సంబంధించి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అమ‌లు చేస్తున్న విధానాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు మ‌న రాష్ట్రానికి చెందిన అధికారుల బృందం ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్నాయి. నైపుణ్యం క‌లిగిన ఏజెన్సీ (కన్సల్టెంట్ ) ని ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు. మంత్రివర్గం యొక్క తుది ఆమోదానికి ముందు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు..

సెప్టెంబర్ 5, 2024 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి, 1 అక్టోబర్, 2024 నుండి కొత్త మ‌ద్యం విధానం అమలు.కొత్త‌గా అమ‌ల్లోకి రానున్న నూత‌న మ‌ద్యం విధానంలో రాష్ట్రంలోకి అక్ర‌మ మ‌ద్యం ర‌వాణా, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ మ‌ద్యం (ఎన్డీపీఎల్) ప్రవేశించ‌కుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంది.. అంతేకాక అల్పాదాయ వ‌ర్గాల వారికి అందుబాటు ధ‌ర‌ల‌కు నాణ్య‌మైన మ‌ద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు అవ‌కాశం క‌లుగుతుంది. రానున్న 60-65 రోజుల్లో మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పార‌ద‌ర్శ‌కంగా మ‌ద్యం సేక‌ర‌ణ విధానాన్ని ఆటోమేటెడ్ సిస్టం క్రింద అందుబాటులోకి తీసుకురానున్నాం.

అంతేకాక‌, ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) మ‌రియు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా కాంప్ర‌హెన్సివ్ క్వాలిటీ కంట్రోల్ విధానాన్ని అమ‌ల్లోకి తీసుకురానున్నాం. అక్ర‌మ మ‌ద్యం (ఐడీ లిక్క‌ర్) నియంత్ర‌ణ‌పై ప్ర‌జ‌ల్లో విస్త‌ృత‌ అవ‌గాహ‌న‌ క‌ల్పించేందుకు ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్నాం. ఇత‌ర రాష్ట్రాల్లో నిర్వ‌హిస్తున్న డీ-అడిక్ష‌న్ మ‌రియు రిహ‌బిలిటేష‌న్ విధానాన్ని అధ్య‌య‌నం చేసి మ‌న రాష్ట్రంలో కూడా స‌మ‌ర్థ‌వంతంగా ఆ కేంద్రాల‌ను నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం జ‌రుతుంది..

దేశ‌వ్యాప్తంగా అమ‌ల‌వుతోన్న ఉత్తమ విధానాల‌ను తెలుసుకోవడానికి ఈ అధ్యయన బందాలు ప‌ర్య‌టిస్తున్నాయి. 2014-19 మ‌ధ్య మా ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌గా ఎక్సైజ్ విధానాన్ని చాలా పార‌ద‌ర్శ‌కంగా అమ‌లు చేయ‌డం జ‌రిగింది..కానీ, 2019-24లో గ‌త ప్ర‌భుత్వం ఎక్సైజ్ విధానాన్ని అస్త‌వ్య‌స్తం చేయ‌డంతో చాలా దుష్ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఐఎంఎఫ్ఎల్ మ‌ద్యం అమ్మ‌కాలు 232 ల‌క్ష‌ల కేసుల‌కు, బీరు అమ్మ‌కాలు 436 ల‌క్షల కేసుల‌కు ప‌డిపోవ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి 2019-24లో రూ.18,860 కోట్లు న‌ష్టం వాటిల్లింది..

ఆ స‌మ‌యంలో సరిహ‌ద్దు రాష్ట్రాలైన తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌లు మ‌ద్యం అమ్మ‌కాల్లో అన్నివిధాల ల‌బ్ధి పొందాయి. అంతేకాక‌, గ‌త ప్ర‌భుత్వం మ‌ద్యం అమ్మ‌కాల స‌ప్లై చైన్ ఉత్ప‌త్తి నుంచి రిటైల్ అమ్మ‌కాల వ‌ర‌కు గుత్తాధిప‌త్యం చెలాయించింది..వివిధ మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు మ‌రియు జాతీయస్థాయి ప్ర‌ముఖ బ్రాండ్ల మ‌ద్యాన్ని మార్కెట్ లో అందుబాటులో లేకుండా చేసింది.. నాణ్యత లేని మద్యం అమ్మ‌కాల‌తో ల‌క్ష‌లాదిమంది ప్ర‌జ‌ల ఆరోగ్యంపై ప్రతికూలం ప్రభావం చూపించింది. ఇప్ప‌టికీ చాలాచోట్ల మ‌ద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు తక్కువగా జ‌రుగుతున్నాయి..తక్కువ ధరకు లభించే మద్యం మాయమైంది. డిజిటల్ లావాదేవీలు తప్పనిసరి అని ముఖ్యమంత్రి అన్నారు.

8.రెవెన్యూ (ల్యాండ్స్):

రూ.22.95 కోట్ల వ్యయంతో జారీచేసిన 21.86 లక్షల భూహక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ ముద్ర, క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని కేబినెట్ నిర్ణయం. రెవెన్యూ శాఖకు సంబంధించి 22ఏ నిషేధిత జాబితా కు సంబంధించి ఫిర్యాదుల సంఖ్యలు పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేబినెట్ కు సూచించారు. రాబోయే మూడు నెలల కాలంలో, గ్రామ సభలు అయ్యేంత వరకు ఎటువంటి రిజిస్ట్రేషన్లు నిర్వహించబడవు.

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ రికార్డులను, పాస్ బుక్ లను తయారు చేయాలని నిర్ణయించడం జరిగింది. రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడం, ల్యాండ్ గ్రాబింగ్ వంటివి జరిగాయన్న వార్తల నేపథ్యంలో ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించి భుూముల బదిలీలో జరిగిన మోసాలు, దోపిడీలు, కబ్జాలు గుర్తించి వాటికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది. పేదవాళ్ల భూ హక్కులను కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ ని దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అయ్యే వరకు రిజిస్ట్రేషన్ ఆపడం జరుగుతుంది.

Read More
Next Story