
‘మైరావణ’సూరిని మెచ్చుకున్న చంద్రబాబు,లోకేష్
రాష్ట్రానికి, తాను జన్మించిన జాతికి ఎనలేని ప్రతిష్టతెచ్చిపెట్టిన ప్రసాద్ సూరికి శుభాభినందనలు అంటూ సీఎం పేర్కొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కించుకున్న ప్రముఖ యువ రచయిత సూరాడ ప్రసాద్కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు అభినందనలు తెలిపారు. విశాఖ జిల్లా మత్స్యకార గ్రామానికి చెందిన యువ రచయిత సూరడ ప్రసాద్ తెలుగు సాహిత్యంలో అత్యుత్తమ పురస్కారం దక్కించుకుని యువతకు స్పూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ‘మైరావణ’ నవలకు గాను సూరాడ ప్రసాద్కు కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
చంద్రబాబు ఏమన్నారంటే..
పేద మత్స్యకార కుటుంబంలో పుట్టి సాహిత్యంపై మక్కువతో రాసిన రెండో నవలకే ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య యువ పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందదాయకం. ఇంతటి అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రసాద్ సూరి(సూరాడ)కి అభినందనలు. సముద్రపు లోతు చూసే మత్స్యకారులకు మనిషి జీవితపు ఎత్తుపల్లాలు చూడటం కష్టమేమీ కాదు అని నిరూపించిన ప్రసాద్ సూరి రానున్న రోజుల్లో సాహిత్యపు శిఖరం తాకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రానికి, తను జన్మించిన జాతికి ఎనలేని ప్రతిష్ట తెచ్చిపెటిన ప్రసాద్ సూరికి మరో మారు శుభాభినందనలు. అంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
లోకేష్ ఏమన్నారంటే..
‘మైరావణ’నవలకు గాను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య యువ పురస్కారం అందుకున్న యువ రచయిత సూరాడ ప్రసాద్కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లికి చెందిన ప్రసాద్ తెలుగు సాహిత్యంపై మక్కువతో అద్భుత రచనలు చేశారు. తన రెండో నవలకే ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవడం ప్రశంసనీయం. మత్స్యకార గ్రామం నుంచి ఎదిగిన ప్రసాద్ తన నవలా రచనలతో యువతకు ఎంతో స్పూర్తిగా నిలిచారు. భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. అంటూ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Next Story