అమ్రపాలికి కేంద్రం షాక్
x

అమ్రపాలికి కేంద్రం షాక్

తెలంగాణాలో పనిచేస్తున్న 11 మంది ఏఐఎస్(ఆల్ ఇండియా సర్వీస్) అధికారులకు కేంద్రప్రభుత్వం పెద్ద షాకిచ్చింది.


తెలంగాణాలో పనిచేస్తున్న 11 మంది ఏఐఎస్(ఆల్ ఇండియా సర్వీస్) అధికారులకు కేంద్రప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. వెంటనే తెలంగాణా నుండి రిలీవ్ అయిపోయి ఏపీలో జాయిన్ అయిపోవాలని ఆదేశించింది. ఈ 11 మంది ఏఐఎస్ అధికారుల్లో ముగ్గురు రిటైర్ అయిపోగా మిగిలిన ఐదుగురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులున్నారు. నిజానికి ఈ 11 మంది ఏఐఎస్ ఏపీకి ఎలాట్ అయిన క్యాడర్ అధికారులే. రాష్ట్ర విభజన నాటికి వీళ్ళంతా తెలంగాణా ప్రాంతంలో పనిచేస్తున్నారు. అందుకనే తమను పర్మినెంటుగా తెలంగాణాకే కేటాయించాలని కేంద్రప్రభుత్వం పరిధిలో పనిచేసే డీవోపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్)ను రిక్వెస్టు చేసుకున్నారు. ఆల్ ఇండియా క్యాడర్ అధికారుల వ్యవహారాలన్నింటినీ హోంశాఖ పరిధిలోని డీవోపీటీయే పర్యవేక్షిస్తుంటుంది. అందుకనే వీళ్ళు పదేపదే తెలంగాణాలోనే తమను ఉంచాలని పదేపదే డీవోపీటీని అడిగారు. గతంలో కూడా ఏపీకి వెళ్ళాల్సిందే అని కేంద్రం చెప్పినపుడు వీళ్ళు కేంద్రం నిర్ణయాన్ని క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్), కోర్టులో సవాలు చేశారు. అయినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది.

వీళ్ళ రిక్వెస్టులపై ఇప్పటికే డీవోపీటీ చాలాసార్లు సమావేశమైంది. అయితే చివరి మీటింగు గురువారం జరిగింది. ఈరోజు జరిగిన ఉన్నతస్ధాయి సమావేశంలో 11 మంది రిక్వెస్టును డీవోపీటీ తిరస్కరించింది. అంతేకాకుండా వెంటనే 11 మందిని రిలీవ్ చేసేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. అలాగే తెలంగాణాలో వీళ్ళు రిలీవ్ అయి ఏపీకి రాగానే వీళ్ళందరికీ పోస్టింగులు ఇవ్వాలని ఏపీ చీఫ్ సెక్రటరీని కూడా ఆదేశించింది. ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్, అమ్రపాలి, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, ప్రశాంతి, ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్, అభిషేక్ మహంతి తో పాటు మరో ముగ్గురు అధికారులు సోమేష్ కుమార్, అనంతరాములు, హరికిరణ్ రిటైర్ అయిపోయారు. అందుకనే సర్వీసులో ఉన్న ఎనిమిదిమందిని వెంటనే తెలంగాణాలో రిలీవ్ అయిపోయి ఏపీలో జాయిన్ అవ్వాల్సిందే అని కేంద్రం ఆదేశించింది.

11 మంది రిక్వెస్టులను డీవోపీటీలోని ఖండేకర్ కమిటి పరిశీలించింది. అనేక సార్లు సమావేశమవటమే కాకుండా సంప్రదింపుల తర్వాత వీళ్ళ రిక్వెస్టులను రెజెక్టు చేస్తున్నట్లు కమిటి డీవోపీటీకి నివేదిక ఇచ్చింది. 2010 బ్యాచ్ కు చెందిన అమ్రపాలి రాష్ట్ర విభజన సమయంలో తన శాశ్వత చిరునామా విశాఖపట్నంగా పేర్కొన్నారు. అందుకనే ఆమెను విభజన నేపధ్యంలో ఏపీకి కేటాయించారు. అయితే ఏపీకి వెళ్ళటానికి ఆమె అంగీకరించలేదు. అమ్రపాలి లాగే మిగిలిన పదిమంది కూడా ఏవో కారణాలు చెప్పి తాము తెలంగాణాలోనే ఉంటామని పట్టుబట్టారు. దానికి కేంద్రం అంగీకరించలేదు.

రాష్ట్ర విభజన కారణంగా రెండు రాష్ట్రాల్లోను ఉండాల్సినంత ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు లేరు. పైగా రెండు రాష్ట్రాల నుండి కొందరు కేంద్రప్రభుత్వానికి డిప్యుటేషన్ పై వెళుతుంటారు. ఇదే సమయంలో కేంద్రం కూడా అవసరమైనంతమందిని రాష్ట్రాలకు కేటాయింపులు చేయటంలేదు. దీనివల్ల రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్ ల కొరత ఎక్కువగా ఉంటోంది. ఇదే సమయంలో అనేక కారణాలతో తాము కోరుకున్న రాష్ట్రాలకే తమను కేటాయించాలని కొందరు ఉన్నతాధికారులు కేంద్రం దగ్గర చాల గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటుంటారు. ఇపుడు పై 11 మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల వ్యవహారం అలాంటిదే. విభజన సమయంలో తాము తెలంగాణాలో ఉన్నాము కాబట్టి తమ సర్వీసు మొత్తం తెలంగాణాలోనే ఉండాలని వీళ్ళు పట్టుపట్టారు. అందుకు కేంద్రం అంగీకరించలేదు. దాంతో వీళ్ళు క్యాట్, కోర్టుల్లో కేసులు వేశారు. సరే, వీళ్ళ వాదన ఎక్కడా చెల్లకపోవటంతో తాజాగా డీవోపీటీ 11 మందిని ఏపీకి కేటాయించేసింది.

Read More
Next Story