
పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ...
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. పి గన్నవరం మండలం చింతావారిపేట సమీపంలో మంగళవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో పంట కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు కాలువలో కొట్టుకుపోయారు. భర్త ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కారులో విశాఖపట్నం నుంచి పి గన్నవరం మండంలోని పోతవరం ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో తన భార్య డ్రైవింగ్ చేస్తోందని భర్త విజయ్కుమార్ తెలిపారు. భార్య ఉమ, కుమారులు మనోజ్, రిషి కాలువలో గల్లంతయ్యారని చెప్పారు. తన కళ్లముందే వారు కొట్టుకుపోయారని విజయ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంలో పిల్లలు ఎంతో సరదాగా ఉండే వారని, ఇకపై వారు లేని జీవితం వ్యర్థమని పిల్లల తండ్రి పేర్కొన్నారు. నా భార్య ఎంతో జాగ్రత్తగా ఉండేదని, మృత్యువు వారిని కబళించి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.