మంగళగిరిలో బుద్ధపూర్ణిమ వేడుకలు
x

మంగళగిరిలో బుద్ధపూర్ణిమ వేడుకలు

మానవతా వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 12న వేడుకలను నిర్వహించనున్నారు.


గుంటూరు జిల్లా మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని రాయల్‌ కన్వెన్షన్‌ మెగా ఏసీ ఫంక్షన్‌ హల్‌లో ఈ నెల 12 వ తేదీన 2,569వ బుద్ధపూర్ణిమ వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు మానవతా వేదిక కన్వీనర్‌ గోలి మధు తెలిపారు. మంగళగిరి రాయల్‌ బ్యాంకెట్స్‌లో గురువారం బుద్ధపూర్ణిమ వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. రేఖా కృష్ణార్జున రావు బౌద్ధ భావజాలానికి ఆకర్షితులై 2001 మే నెలలో బుద్ద పూర్ణిమ, మహా వైశాఖి రోజున మంగళగిరిలో బౌద్ధ సంఘం ప్రారంభించారని తెలిపారు.

అప్పటి నుంచి బుద్ధపూర్ణిమ వేడుకలను దిగ్విజయంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అది 2007 బుద్ద పూర్ణిమ నుంచి మంగళగిరి బుద్ధ విహార్‌గా రూపాంతరం చెందిందని చెప్పారు. రేఖా కృష్ణార్జున రావు మంగళగిరి బుద్ధ విహార్‌ ఆధ్వర్యంలో బౌద్ధ అభిమానులను సమీకరించి, దేశంలోని బౌద్ధ కేంద్రాలను పర్యటిస్తుంటారని, బుద్ధుని జన్మదిన వేడుకలు, బౌద్ధ బోధనలు, యోగా, బౌద్ధ భావజాలంపై అవగాహన, సేవా కార్యక్రమాలు.. వంటివి వందల సంఖ్యలో నిర్వహించారని వివరించారు. బుద్ధవిహార్‌ ఆధ్వర్యంలో 2011లో బుద్ద పూర్ణిమ, మహా వైశాఖి రోజున ‘బుద్దభూమి’ మాస పత్రికను ప్రారంభించారు. కృష్ణార్జున రావు ఎంతో వ్యయప్రయాసలకోర్చి ‘బుద్ధభూమి’ మాస పత్రికను నిరాటంకంగా తీసుకువస్తున్నారని తెలిపారు.

మనవతావాది కృష్ణార్జున రావు సారథ్యంలోని బుద్ధ విహార్‌ ఆధ్వర్యంలో బుద్ధ జయంతి(పూర్ణిమ) వేడుకలు 22 ఏళ్లపాటు ఘనంగా జరిగాయని, ఆ తర్వాత ఆయన సూచనలు, సలహాలతో మానవతా వేదిక ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నట్లు బుద్ధపూర్ణిమ రజతోత్సవ వేడుకల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు గుత్తికొండ ధనంజయరావు తెలిపారు. ఈ నెల 12న జరిగే వేడుకల్లో ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు అబ్దుల్‌ రజా హుస్సేర్‌ రాసిన ‘కళల సిరి మంగళగిరి’ అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. ఈ రజతోత్సవ వేడుకలకు మంగళగిరి, చుట్టుపక్కల గ్రామాల వారు హాజరై విజయవంతం చేయాలని ధనుంజయ కోరారు.
ఈ సమావేశంలో గౌరవాధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, బుద్ధవిహార్‌ అధ్యక్షులు రేఖా కృష్ణార్జున రావు, విశ్వశాంతి కళా పరిషత్‌ కన్వీనర్‌ పొట్లాబత్తుని లక్ష్మణరావు, ప్రజా నాట్యమండలి కళాకారులు గాయకులు కంచర్ల కాశయ్య, సందుపట్ల భూపతి, అలక తాతారావు, పిరమిడ్‌ సీనియర్‌ మాస్టర్‌ ఆకురాతి శంకర్రావు తదితరులు మాట్లాడారు.
Read More
Next Story