
త్వరలో బుడమేరు రిటైనింగ్ వాల్
సీజన్ మొదలయ్యాలోగా మూడు గండ్ల నిర్మాణం పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
గత వరదల్లో విజయవాడను ముంచెత్తిన బుడమేరు ప్రాంతాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం పరిశీలించారు. గత బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. గతంలో అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సీజన్ మొదలయ్యేలోగా 3 గండ్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా, పెండింగ్ పనులు పూర్తి చేసేలా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. బుడమేరు వరద, ఎనికేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుండి సముద్రంలో కలిసేలా విధంగా చేపట్టే కార్యక్రమానికి సంబంధించిన డీపీఆర్ తయారీ దశలో ఉందన్నారు.
బుడమేరు ఓల్డ్ ఛానెల్కు సమాంతరంగా, మరొక కొత్త ఛానెల్ను కూడా 20 వేల క్యూసెక్కుల సామర్ద్యంతో అభివృద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మానేజ్మెంట్ కింద, కేంద్రం సహాకారంతో ముందుకు వెళ్ళేలా ప్రతిపాదనలు తయారు చేసామన్నారు. మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మానేజ్మెంట్ శాఖలు సమన్వయం చేసి ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఉంచుతామన్నారు.
Next Story