కూటమి ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించిన ప్రతి సారి.. ఆయన సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెరపైకి వస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే.. జగన్కు కూడా కౌంటర్లు ఇవ్వడం పరిపాటిగా మారింది. బహుశా ఇది ఆమె రాజకీయ వ్యూహంలో భాగమేమో కానీ.. తాజాగా మరో సారి విమర్శలు సంధించారు. పది పరీక్షలు, మూల్యాంకనం మీద ఆమె ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూడా షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఇరు ప్రభుత్వాల వైఫల్యం వల్లే పదో తరగతి విద్యార్థులు దారుణంగా నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులను, విద్యా వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో ఎవరు ఎక్కువా కాదు.. ఎవరు తక్కువా కాదని మండిపడ్డారు. ఆ మేరకు ఆదివారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
షర్మిల ఏమన్నారంటే..
10వ తరగతి పరీక్ష ఫలితాల రీ కౌంటింగ్ పై జగన్ , లోకేష్ గార్ల మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. వైసీపీ హయంలో ప్రతి ఏటా రీ కౌంటింగ్లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో 20 శాతం మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న 30 వేల మందిలో 11 వేల మందికి తిరిగి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే, పేపర్ల మూల్యాంకనంపై ఈ రెండు ప్రభుత్వాలకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తుంది. ఫలితాల్లో పారదర్శకత లేదని స్పష్టం అయ్యింది. విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారు అనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు.
వాస్తవానికి ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదు. పేపర్లు సరిగ్గా దిద్దలేని వైసీపీ, కూటమి ప్రభుత్వాలే రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా ఫెయిల్. పిల్లల భవిష్యత్ను నిర్ణయించడంలో ఫెయిల్ అయిన వీళ్ళు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారు ? చదువులతో చెలగాటం ఆడుతున్నారు. విద్యార్థుల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటున్నారు. ధనదాహం మీద ఉన్న శ్రద్ధ విద్యావ్యవస్థను ఉద్ధరించడం మీద లేదు. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 30 వేల మంది విద్యార్థులకు సంబంధించి 60 వేల పేపర్ల రీ కౌంటింగ్ కు వస్తే అందులో 11 వేల మందికి అత్యున్నత మార్కులు వచ్చాయంటే పూర్తిగా మీ ప్రభుత్వ వైఫల్యమే. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఫెయిల్ అయినట్లే. వెంటనే విచారణ చేయండి. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి పేపర్ మళ్ళీరీ వెరిఫికేషన్ ఉచితంగా చేయండి. అంటూ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిల మీద షర్మిల తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.