
భువనమ్మకు ’బంగారు నెమలి‘ అవార్డు
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు భావోద్వేగానికి గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ వీసీఎండీ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక బంగారు నెమలి (గోల్డెన్ పీకాక్) అవార్డు లభించింది. లండన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) సంస్థ ఈ అవార్డును హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో ప్రదానం చేసింది. హెరిటేజ్ సంస్థ తరపున నారా భువనేశ్వరి ఈ గౌరవాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమం 2025 నవంబర్ 4న లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 1:30 గంటల సమయంలో ఈ పురస్కార ప్రదానం జరిగింది.
ఈ కార్యక్రమంలోనే భువనేశ్వరికి వ్యక్తిగతంగా డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025 అవార్డు కూడా అందజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ, మహిళా సాధికారత, విద్య, వైద్యం, రక్తదానం, తలసేమియా సహాయం వంటి రంగాల్లో చేసిన సేవలకు ఈ గుర్తింపు లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హెరిటేజ్ ఫుడ్స్ను దేశంలోని ప్రముఖ డెయిరీ బ్రాండ్గా తీర్చిదిద్దడం, పారదర్శక పాలన, సామాజిక బాధ్యత, రైతుల సాధికారత, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు, కోట్లాది మంది వినియోగదారులకు సేవలు అందించడం వంటి కారణాలతో ఈ అవార్డు లభించింది. భువనేశ్వరి నాయకత్వంలో సంస్థ ఈ ఘనత సాధించింది. ఇది హెరిటేజ్ ఫుడ్స్కు మొదటి అవార్డు కాదు. 2017లోనూ IOD నుంచి కార్పొరేట్ గవర్నెన్స్ & సస్టైనబిలిటీ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. భువనేశ్వరి అప్పట్లోనూ సంస్థ తరపున ఆ అవార్డను స్వీకరించారు.
చంద్రబాబు నాయుడు ఎక్స్లో పోస్ట్ చేస్తూ, “భువనేశ్వరి ఈ రెండు అవార్డులు అందుకోవడం గర్వకారణం. ఆమె సేవలు, నాయకత్వం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి” అని తెలిపారు. భువనేశ్వరి కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మా చాలా త్రిల్లింగ్ గాను, గౌర్వంగాను ఉంది అంటూ నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు.

