టీడీపీ కార్యకర్తలకు బాబు అభయం
x

టీడీపీ కార్యకర్తలకు బాబు అభయం

తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయ విభాగం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించే పనిలో సీఎం చంద్రబాబు ఉన్నారు.


తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం పని చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని టీడీపీ జాతీయ అధ్యక్షలు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. నాయకుల మాదిరిగానే కార్యకర్తలకు కూడా రకరకాల సమస్యలు ఉంటాయని, కార్యకర్తలే లేకుంటే 2024 ఎన్నికల్లో టీడీపీ ఇంత భారీ స్థాయిలో మెజారిటీతో గెలిచేదే కాదనే అభిప్రాయాన్ని బాబు వెలుబుచ్చారు. అందుకోసం ప్రతి వారం కార్యకర్తలకు ముఖ్యమంత్రిగా తాను అందుబాటులో ఉండాలనే నిర్ణయానికి బాబు వచ్చారు. ప్రజల నుంచి వచ్చే గ్రీవెన్స్‌ పరిష్కరించడం ఒక ఎల్తైతే పార్టీ కార్యకర్తల నుంచి వచ్చే అభిప్రాయాలను తీసుకొని పార్టీని బలోపేతం చేయడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించడం మరొక ఎత్తనే అభిప్రాయాంలో సీఎం చంద్రబాబు ఉన్నారు. అందుకే ప్రతి శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి క్రమం తప్పకుండా వస్తానని, గెలిచిన తర్వాత మొదటి సారి టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన సందర్భంగా బాబు వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయా జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాలకు తరచుగా వెళ్లాలని బాబు ఆదేశించారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి మంత్రులు వెళ్లాలని బాబు చెప్పడం విశేషం. అమరావతిలోని సచివాలయంలో మంత్రులు ఎప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు.

ప్రభుత్వానికి పార్టీకి మధ్య ప్రత్యేక వింగ్‌
ఇప్పటి వరకు పార్టీ వేరు, ప్రభుత్వం వేరనే భావన అందరిలో ఉంది. అయితే పార్టీ వారే ప్రభుత్వాన్ని నడుపుతున్నారనేది తెలియజెప్పేందుకు పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబులో ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు కలిసినప్పుడు వారికి ఈ విషయం చెప్పారు. త్వరలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుటటానన్నారు. ఆ విభాగం ఏర్పాటైతే పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండటంతో పాటు పార్టీ పెద్దల నుంచి సలహాలు, సూచనలు కూడా ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది.
పార్టీ కోసం పూర్తి కాలం పనిచేసేలా..
కార్యకర్తలను గ్రామ స్థాయిలో పార్టీ కోసం పూర్తిగా పని చేసేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. పూర్తి స్థాయిలో పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తున్న వారికి పార్టీ నుంచి కొంత రెమ్యునరేషన్‌ కూడా ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి పంచాయతీ స్థాయిలో కమిటీలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. పార్టీ నిర్మాణం విషయంలో మొదటి నుంచి టీడీపీ పకడ్బందీగానే వ్యవహరిస్తోందని పార్టీ నాయకులు చెబుతున్నారు. అందుకే పార్టీ ముఖ్య కార్యకర్తలను దగ్గరకు తీసుకొని వారితో అప్పుడప్పుడు మాట్లాడుతూ వారి సమస్యలు పరిష్కరిస్తేనే పార్టీ ఎక్కువ కాలం మనగలుగుతుందనే ఆలోచనతో ప్రతి శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రావాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం.
Read More
Next Story