
ఏపీ పర్యాటక శాఖ సలహాదారుగా బాబా రామ్దేవ్?
ఆయన సేవలు ఆంధ్రప్రదేశ్ కు అవసరం అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సలహాదారుగా ఉండాలని బాబా రామ్దేవ్ను కోరినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన టూరిజమ్ కాంక్లేవ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక వేత్తగా ఉన్న ఉన్న బాబా రామ్దేవ్ భారత సమాజానికి ఎనలేని సేవలు చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని బాబా రామ్దేవ్ను కోరుతున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ది కోసం చర్యలన్నీ చేపట్టామన్నారు.
భవిష్యత్తు అంతా పర్యటాక రంగానిదే అని తాను ఎప్పుడో చెప్పానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ టూరిజమ్ అనేది ఇంకా అభివృద్ధి కావలసి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన సముద్ర తీర ప్రాంతం ఉందని, అంతకంటే మించి అందమైన అటవీ ప్రాంతం, పాపికొండలు, కోనసీమ, హార్సిలీ హిల్స్ వంటి ప్రదేశాలు ఉన్నాయన్నారు. హార్సిలీ హిల్స్ను మరింతగా డెవలప్ చేయాల్సి ఉందని, దేశంలోనే గొప్ప వెల్నెస్ సెంటర్గా మదనపల్లె మారాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.
వెల్నెస్ సెంటర్లతో పాటు యోగా, మెడిటేషన్ సెంటర్లు పర్యాటక రంగంలో గేమ్ఛేంజర్లు కానున్నాయని సీఎం పేర్కొన్నారు. సంపద సృష్టించాలనే లక్ష్యంతోనే పర్యటాక రంగానికి కూడా తాము పారిశ్రామిక రంగం హోదా కల్పించామన్నారు. ఒక పక్క ధనవంతులు బాగా పెరుగుతున్నారని, మరో వైపు పేదలను కూడా పైకి తెచ్చేందుకు అందరూ కలిసి కృషి చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతయాని యువత భయపడాల్సిన అవసరం లేదని, స్కిల్స్ పెంచుకొని స్మార్ట్ వర్క్ చేస్తే జాబ్స్ ఎక్కడికి పోవన్నారు. అంతకుముందు బాబా రామ్దేవ్తో కలిసి టూరిజమ్ క్యారవాన్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పర్యాటక రంగంలో రూ. 2లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా విజయవాడలో టూరిజమ్ కాంక్లేవ్ను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీలో ప్రముఖ పట్టణాలైన విశాఖపట్నం, తిరుపతితో పాటు రాజధాని అమరావతిలో స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.
Next Story