చంద్రబాబుకు అవార్డు..పవన్ కల్యాణ్ అభినందనలు
x

చంద్రబాబుకు అవార్డు..పవన్ కల్యాణ్ అభినందనలు

సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు ప్రకటించారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రముఖ ఆర్థిక పత్రిక 'ఎకనమిక్ టైమ్స్' సంస్థ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి ఆయన చేపడుతున్న సంస్కరణలు, పెట్టుబడులను ఆకర్షించడంలో చూపుతున్న చొరవకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. మరో వైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని 'ఎకనమిక్ టైమ్స్' సంస్థ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు.

స్ఫూర్తిదాయక నాయకత్వం అని పవన్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వ శైలి ఎంతో స్ఫూర్తినిస్తుందని, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన అమలు చేస్తున్న సంస్కరణలు నవతరం భవిష్యత్తుకు బాటలు వేస్తాయని పవన్ పేర్కొన్నారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ కి ఇదో గుర్తింపని పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ఒక ప్రత్యేక 'బ్రాండ్ ఇమేజ్' వస్తుందని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు. పారిశ్రామిక వృద్ధి: పారిశ్రామిక వృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తాయని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

పురస్కార వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అనుకూల విధానాలను (Ease of Doing Business) ప్రవేశపెట్టడం, పారిశ్రామిక సంస్కరణల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహించినందుకు గానూ చంద్రబాబును ఈ అవార్డు వరించింది. 2026 మార్చిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా సీఎం ఈ అవార్డును అందుకోనున్నారు.
సమిష్టి విజయమన్న సీఎం
ఈ గుర్తింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. ఇది మంత్రులు, అధికారులు, కలెక్టర్ల సమిష్టి కృషికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ఈ పురస్కారం పట్ల రాష్ట్ర మంత్రివర్గం, ఉన్నతాధికారుల నుంచి ముఖ్యమంత్రికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Read More
Next Story