
బ్యాంకర్ల సమావేశంలో చంద్రబాబు
ప్రజల కోసం బ్యాంకులా, బ్యాంకుల కోసం ప్రజలా?
నేను ఆర్ధిక శాస్త్రం చదివా, దేశదేశాలు తిరిగానని బ్యాంకర్లతో చెప్పిన చంద్రబాబు
ప్రజల కోసం బ్యాంకులా, బ్యాంకుల కోసం ప్రజలా అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంకుల నిర్ణయాలు ఉండాలన్నారు. సీఎం అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఖరీఫ్లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయిందని, ఈ పాటికే రైతులకు రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిఉందని చెప్పారు. సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వడం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమానికి బ్యాంకుల సహకారంపై చర్చించారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు అంశం పైనా చర్చించారు.
‘‘మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లూ తీరు మార్చుకోవాల్సి ఉంది. కేంద్రం.. జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చింది. బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజలను నియంత్రించకూడదు. తదుపరి సంస్కరణల దిశగా ప్రజలను ప్రోత్సహించాలి. అమెరికా, చైనా లాంటి దేశాలకు సవాల్ విసిరేలా మన ఆర్థిక వ్యవస్థ తయారవుతోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచనలు చేయాలి. 2047 నాటికి భారత్ బలమైన ఆర్థికవ్యవస్థగా తయారవుతుంది. ఉత్పాదకత లేని రుణాలు కూడా మంచివి కాదు. పేదలు-ధనికుల మధ్య అంతరాలు తగ్గేందుకు చర్యలు చేపట్టాలి. ఆర్థికశాస్త్రం చదివిన విద్యార్థిగా, ప్రజాప్రతినిధిగా పేదల కోసమే ఆలోచిస్తా. దేశంలో సంపద సృష్టి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా బ్యాంకులు, ఆర్థికసంస్థలు పని చేయాలి’’ అని చంద్రబాబు అన్నారు.
అమెరికా, చైనా లాంటి దేశాలకు సవాలు విసిరేలా మన ఆర్ధిక వ్యవస్థ తయారు అవుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచనలు చేయాలని అధికారులకు సూచించారు. 2047 నాటికి బలమైన ఆర్ధిక వ్యవస్థగా భారత్ తయారవుతుందన్నారు. ఈ క్రమంలోనే ఫాల్స్ లెండింగ్ చేయాలని ఎవరూ సిఫార్సు చేయరని, ఉత్పాదకత లేని రుణాలు కూడా మంచివి కావని వ్యాఖ్యానించారు. పేదలు- ధనికుల మధ్య అంతరాలు తగ్గేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్ధికశాస్త్రం చదివిన విద్యార్ధిగా, ప్రజాప్రతినిధిగా పేదల గురించి తాను ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
231 ఎస్ఎల్ బీసీలో తీసుకున్న నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టుపై సమీక్ష చేసిన సీఎం.. వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రపెన్యూర్ కార్యక్రమం, 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు అంశంలో బ్యాంకుల సహకారంపై చర్చలు జరిపారు.
Next Story