ఆర్థికాభివృద్ధికి తొడ్పడాలి... పర్యావరణం బాగుండాలి
ఏ ప్రాజెక్టులు చేపట్టినా... రాష్ట్రానికి ఆర్థికంగా ఉపయోగపడడంతోపాటు... పర్యావరణ హితంగా ఉండాలి. ఈ దిశగానే విశ్వసముద్ర మూడు ప్రాజెక్టులు చేపట్టింది. 24 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన విశ్వసముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ రోజుకు 200 కిలోలీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేస్తోంది. దీని కోసం 15 వేల టన్నులకు పైగా పాడైన బియ్యం, నూకలు, పంట వ్యర్ధాల కొనుగోలు చేస్తోంది. దీని వల్ల రైతులకు మేలు జరుగుతోంది. రైతుల సంక్షేమంతో పాటు ఇథనాల్ తయారు చేస్తూ విశ్వసముద్ర యాజమాన్యం దేశ ప్రగతికి తోడ్పడుతోంది. అలాగే పశు సంపదను కాపాడేందుకు కొత్త ప్రయోగం చేయటం అభినందనీయం. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన గోవులను సంరక్షిస్తున్నారు. ఒంగోలు జాతి పశువులను సంరంక్షిచడంపై ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేయడమే కాకుండా.. శాస్త్రీయ పద్దతుల్లో పునరుత్పత్తికి చింతా శశిధర్ ఫౌండేషన్ పని చేస్తోంది. పవర్ ఆఫ్ బుల్ అనే విధానంలో విద్యుత్పత్తి చేపట్టడం వినూత్న ప్రక్రియ. ఈ విధానం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 5 కిలోవాట్లను ఇన్ హౌస్ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఇక నంద గోకులం లైఫ్ స్కూల్ ద్వారా ప్రతిభ కలిగిన, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఉత్తమ విద్యను అందిస్తున్నారు. సమాజానికి తిరిగి ఇవ్వటం అనే విధానంలో భాగమే పీ4. డబ్బులు ఇవ్వటం ఒక్కటే కాదు చేయూత ఇవ్వడమనేది పీ4 విధానంలో ముఖ్యమైన అంశం అని ముఖ్యమంత్రి వివరించారు.
భవిష్యత్తులో భారీ పెట్టుబడులు
విశాఖకు ఇప్పటికే భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. రూ.88 వేల కోట్లతో ఓ దేశచరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడిగా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ఆల్గారిథమ్స్ కూడా రాసేలా మన పిల్లలు సిద్ధం అవుతున్నారు. 2047కి భారత్ నెంబర్ 1 ఆర్ధిక వ్యవస్థగా తయారవుతుంది. ఏపీ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది అని సీఎం చెప్పారు.