
అమెరికాలో ఏపీ విద్యార్థి లోకేష్ మృతి
ఎంఎస్ పూర్తి చేసిన పాటిబండ్ల లోకేష్ అక్కడే మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్కు చందిన పాటిబండ్ల లోకేష్ అనే యువకుడు ప్రమాద వశాత్తు ప్రాణాలు కోల్పోయి మృత్యువాత పడ్డాడు. స్విమ్మింగ్ పూల్లో పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దీంతో మృతుని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరో వైపు బాపట్ల జిల్లా మార్టూరు యువకుడు అమెరికాలో ప్రమాదవశాత్తు ఈత కొలనులో దిగి మృత్యువాత పడిన సంఘటన స్థానికంగా విషాదం నింపింది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు శోక సముద్రంలో మునిగిపోయారు.
మార్టూరు గ్రామానికి చెందిన గ్రానైట్ వ్యాపారి పీ వేణుబాబు కుమారుడు పాటిబండ్ల లోకేశ్ (23) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అమెరికాలోని బోస్టన్ సిటీలో కొన్నాళ్లుగా ఉంటున్నట్లు లోకేష్ బంధువులు వెల్లడించారు. అక్కడే ఎంఎస్ పూర్తి చేశాడు. ఎంఎస్ పూర్తయిన తరువాత ఉద్యోగం కూడా సాధించాడు. దీంతో ఎనిమిది నెలలుగా అక్కడే ఉంటున్నాడు. అయితే లోకేశ్ ఈత కొలనులో పడి మృతిచెందినట్లు గురువారం రాత్రి మార్టూరులోని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఈనెల 3న ఈతకు వెళ్లాడని అమెరికా నుంచి సమాచారం ఇచ్చినట్లు బంధువులు తెలిపారు.
అయితే లోకేశ్కి ఈత వచ్చని, సమీప బంధువులు కూడా బోస్టన్లో ఉంటున్నారని చెప్పారు. మరణించిన లోకేష్ మృతదేహాన్ని మార్టూరు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మరో వైపు మృతుడు లోకేష్కు డిగ్రీ పూర్తిచేసిన సోదరుడు ఉన్నారు. లోకేశ్ మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రానైట్ యజమానులు పెద్దసంఖ్యలో వేణుబాబు ఇంటికి చేరుకుని పరామర్శించారు.
Next Story