
పెట్టుబడులకు ఏపీ అనువైనది
సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టైన్ రైజర్ కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు నాయుడు
విశాఖలో నిర్వహించే 30వ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామిక వేత్తలను, వివిధ దేశాల రాయబారులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరై మాట్లాడారు. నవంబరు 14,15వ తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతుంది. ఇప్పటి వరకూ 7 మార్లు సీఐఐ భాగస్వామ్య సదస్సులు నిర్వహించాం. పరిశ్రమలకు అనువుగా ఉండేలా లాజిస్టిక్స్ ను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు నిర్మాణం చేపడుతున్నాం. సంపద సృష్టికి పెట్టుబడులు రావాలి, సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూలించగలం అని అన్నారు.
ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 రూపోందిస్తే.. మేం స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశాం. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యం. దీని కోసం 10 సూత్రాలను ఆధారంగా చేసుకుని పని చేస్తున్నాం. లాజిస్టిక్స్, డీప్ టెక్నాలజీ, ప్రాడెక్టు పర్ఫెక్షన్ లాంటి కీలకమైన లక్ష్యాలను పెట్టుకున్నాం. సమీకృత అభివృద్ధి అనేది ఇప్పుడు ఓ నినాదం... పీ4 ద్వారా సమీకృత అభివృద్ధి సాధ్యం అని చెప్పారు.
స్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్, ఏరోస్పేస్ సిటీలను ఏపీలో ఏర్పాటు చేస్తున్నాం. 2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుంది. ఆ తదుపరి రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను కూడా ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటాం. 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పనిచేస్తోంది. పనిచేసే యువత భారత్ కు ఉన్న అతిపెద్ద వనరు. ఇదే దేశాభివృద్ధికి కీలక వనరు అన్నారు.
పునరుద్పాదక విద్యుత్ రంగంలో 500 గిగావాట్లను దేశంలో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశిస్తే ఏపీ 160 గిగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులిస్తున్నాం అని సీఎం చెప్పారు.