కేంద్ర సర్వీసులకు ఏపీ ఐఏఎస్‌లు
x

కేంద్ర సర్వీసులకు ఏపీ ఐఏఎస్‌లు

ఆ ఐఏఎస్‌ అధికారులను వెంటనే రిలీవ్‌ చేయాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


కీలక శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. ఆ ఇద్దరు అధికారులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చాలా కీలకమైన పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. జే నివాస్‌తో పాటు ఎం హరినారాయణ్‌లు కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. జే నివాస్‌ 2010వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన కీలకమైన ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఎం హరినారాయణన్‌ కూడా 2011వ బ్యాచ్‌కు చందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారే. ప్రస్తుతం ఈయన అత్యంత కీలకమైన స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖకు ఐజీగా పని చేస్తున్నారు.

అయితే జే నివాస్‌ను జనగణన కార్యకలాపాల డైరెక్టర్‌గా కేంద్రం నియమించింది. అలాగే ఎం హరినారాయణన్‌ న్యూఢిల్లీ తాగునీరు, పారిశుద్ధ్య విభాగం డైరెక్టర్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను వెంటనే రిలీవ్‌ చేయాలని కేంద్రం కోరగా ఆ మేరకు తక్షణమే వారిని రిలీవ్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే నివాస్‌ ఢిల్లీ వెళ్తుండటంతో ఖాళీ అయిన ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి నియామకానికి చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ ఆదేశించారు. ఎం హరినారాయణన్‌ విధులు నిర్వహిస్తున్న స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ పోస్టు బాధ్యతలను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి అప్పగించింది. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌గా ఉన్న వీరపాండ్యన్‌కు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ ఆదేశాలు జారీ చేశారు.

Read More
Next Story