
ప్రజారోగ్యంపై 20వేల కోట్లు ఖర్చు
సుదీర్ఘకాలం ప్రధానిగా ఉండి మంచి పాలన అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
ప్రజారోగ్యంపై 20వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రజారోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన స్వస్త్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని లైవ్లో వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ..మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సుదీర్ఘకాలం ప్రధానిగా ఉండి మంచి పాలన అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 ఏళ్లలో మనదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి నెంబర్ వన్ గా తయారవుతుంది.
వికసిత్ భారత్ కల సాకారంతో పేదరిక నిర్మూలన మనం చూడబోతున్నాం. జీఎస్టీ సంస్కరణలతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అలాగే దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ పనిచేస్తున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా రాష్ట్రం బాగుంటుంది. మంచి ఆరోగ్యం కోసం చక్కెర, ఉప్పు, నూనె వాడకాలను తగ్గించాలని కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం స్వస్త్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి మహిళ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవాల్టి నుంచి అక్టోబర్ 2 తేదీ వరకూ 15 రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. రాష్ట్రమంతటా 13,944 హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. తల్లిబిడ్డా ఆరోగ్య రక్షణ కోసం కార్డులు జారీ, గర్భిణీ స్త్రీల సంరక్షణతో పాటు పిల్లలకు టీకాలు వేయడంపై దష్టి పెట్టాం. రక్తహీనత, పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తాం. హైబీపీ, షుగర్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, టీబీ తదితర అన్నిరకాల వైద్య పరీక్షలు ఈ కార్యక్రమంలో ఉచితంగా చేస్తాం. గైనకాలజీ, ఈఎన్టీ, నేత్ర, డెర్మటాలజీ, సైకియాట్రీ, డెంటల్ సర్జన్, పీడియాట్రిషన్ డాక్టర్లు ఈ శిబిరాల్లో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు.