
సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు
రూ. 40వేల నుంచి రూ. 70వేల వరకు బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశారు.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు తీపి కబురు ప్రకటించింది. సీపీఎస్ ఉద్యోగులకు మొదటి విడత డీఏ బకాయిలను విడుదల చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు చేసి గ్రీన్ చాలన్లో ఉన్న ఏపీ సచివాలయం సీపీఎస్ ఉద్యోగులకు వారి వారి ఖాతాల్లో డీఏ బకాయిలను జమచేసింది. తక్కిన సీపీఎస్ ఉద్యోగులందరికీ 90 శాతం డీఏ బకాయిలను చెల్లించేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం ఆరు విడతలుగా పూర్తి బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఉద్యోగికి రూ. 2లక్షల నుంచి రూ. 4లక్షల వరకు బకాయిలను చెల్లించే విధంగా కసరత్తును ముమ్మరం చేసింది. అందులో భాగంగా తొలివిడతగా సోమవారం ఒక్కో సీపీఎస్ ఖాతాలో రూ. 40వేల నుంచి రూ. 70 వేల వరకు బకాయిలను జమ చేసింది. డీఏ బకాయిలపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ సచివాలయం సీపీఎస్ ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అధ్యక్షులు కోట్ల రాజేశ్, ఉపాధ్యక్షులు ప్రసాద్లు హర్షం వ్యక్తం చేశారు.