
కూటమిది డొంకతిరుగుడు–సూటిగా సమాధానాలు చెప్పడం లేదు
కూటమి ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప ఇంకేమీ పట్టవా అని బొత్స సత్యనారాయణ నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కూటమి ప్రభుత్వం డొంక తిరుగుడు ధోరణిని ప్రదర్శిస్తోందని, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పడం లేదని మండలిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మండలిలో కూటమి ప్రభుత్వం, మంత్రులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ మండలి నుంచి వాకౌట్ చేసింది. అనంతరం బొత్స సత్యనారాయణ బాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపైన అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప ఇంకేమీ పట్టవా అని ప్రశ్నించారు. తమకు కావలసింది రాజకీయాలు కాదని, ప్రజలకు మేలు జరగడమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నలు అడిగితే బాధ్యతా రాహిత్యమైన సమాధానాలు మంత్రుల నుంచి వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. నిస్సిగ్గుగా వారు సమాధానాలు చెబుతున్నారని మండిపడ్డారు. తాము 50 ఏళ్లకే పెన్షన్ గురించి ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పలేదన్నారు.
తాము హుందాగా ప్రశ్నలు అడుగుతుంటే ప్రభుత్వం డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి, సింహాచలం ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని, ఇవి ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సమాధానాలు చెప్పలేక జగన్ పరామర్శకు వెళ్లడాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి, సింహాచలం ఘటనలపై ప్రభుత్వానికి బాధ్యత లేదా అని నిలదీశారు. తాము హుందాగా ప్రశ్నలు అడుగుతుంటే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాత్రం వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మండలిలో ప్రభుత్వ నిర్లక్ష్య, బాధ్యతారాహిత్య వైఖరికి నిరసనగా తాము మండలి నుంచి వాకౌట్ చేసినట్లు వెల్లడించారు.