
రేపు ఏపీ కేబినెట్–కీలక అంశాలపై చర్చ
జూన్ 4తో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా బుధవారం ఏపీ కేబినెట్ భేటీ కానుంది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం జరగనుంది. బుధవారం ఉదయం 11గంటలకు అమరావతి సచివాలయంలో ఈ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి మీద చర్చించనున్నారు. మరి ముఖ్యంగా భూముల సేకరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అమరావతి ప్రాంతంలో రెండో దశ కింద 44 వేల ఎకరాల భూమిని సేకరించే అంశంపైన కేబినెట్లో చర్చించి ఓ నిర్ణయానికి రానుంది. దీంతో పాటుగా రాజధాని అమరావతిలో నిర్మంచాలని భావిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం, దానికి కావలసిన భూమి ఐదు వేల ఎకరాల భూమిపైన కూడా చర్చించి ∙నిర్ణయం తీసుకోనున్నారు.
అమరావతిలో జరిగే జీఏడీ టవర్లు, వాటి నిర్మాణాలకు సంబంధించిన టెండర్లకు ఆమోదం తెలపనుంది. వీటితో పాటు హెచ్ఓడీ నాలుగు టవర్ల నిర్మాణాలకు సంబందించిన టెండర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మరో 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ హాబ్ నిర్మాణం, వివిధ సంస్థలకు భూ కేటాయింపులతో పాటు తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ పథకాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా కూటమి అధికారంలోకి వచ్చిన జూన్4తో ఏడాది కాలం పూర్తి అవుతున్న సందర్భంగా నిర్వహించే ఈ కేబినెట్ సమావేశంలో ఈ ఏడాది పాలనపై కూడా చర్చించనున్నారు.