
ఉద్దానానికి, కుప్పంకు మంచినీళ్ల ఫండ్ విడుదల
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం
మూత్రపిండాల సమస్య ఎదుర్కొంటున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, చిత్తూరు జిల్లా కుప్పం మంచినీళ్ల సరఫరాకు నిధులు ఉదారంగా అందించాలని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ ఈ ప్రాంతాలలో ఎన్టీఆర్ సుజల కింద నీటి శుద్ది చేసే ప్లాంట్లకు వయబులిటీ ఫండ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఫలితంగా ఉద్దానంకు రూ. 5.75 కోట్లు, కుప్పంకు రూ. 8.22 కోట్లు కేటాయిస్తారు. ఉద్దానం, కుప్పంలో ప్రజలకు రూ. 2 కే 20 లీటర్లు తాగునీరు సరఫరా చేయాలని కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. వన్ టైం సెటిల్మెంట్ కింద వయబిలిటీ ఫండ్ గా ఈ ఆర్థిక సహాయం అందుతుంది.
మహిళలకు నైట్ షిప్ట్
క్యాబినెట్ తీసుకున్న మరొక ముఖ్యమయిన నిర్ణయం ఫ్యాక్టరీల్లో మహిళా ఉద్యోగులకు ఇకపై నైట్ షిఫ్ట్ లో పనిచేసేందుకు వీలుగా చట్టాన్ని సవరించడం. మహిళలు రాత్రిపూట నిర్వహించేందుకు పూర్తి రక్షణ కల్పించేందుకు చట్ట సవరణలు చేయాలని నిర్ణయించింది. ఫ్యాక్టరీల్లో పని చేసే మహిళలకు ప్రస్తుతం ఒవర్ టైం 50 లేదా 75 గంటలు మాత్రమే పని చేసే అవకాశం ఉంది. ఇకపై మహిళలు క్వాటర్లో 144 గంటలు ఒవర్ టైం చేసేందుకు వీలుగా ఏపీ షాప్స్ ఆండ్ ఎస్టాబిలిష్ మెంట్ బిల్లు 2025 చట్టంలో నింబధనల సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
హోం శాఖ కార్యదర్శి క్షమాపణలు
2016 జనవరి 31 తుని సమీపాన జరిగిన రైలు దహనం కేసు రీఒపెన్ చేసేందుకు విడుదల చేసినఉత్తర్వుల ప్రస్తావన కూడా మంత్రివర్గంలో ప్రస్తావనకు వచ్చింది. జీవొ విడుదల చేయడం తప్పని క్యాబినెట్ భావించింది. విడుదల చేసేముందుకు ప్రతీ ఉత్తర్వులును జాగ్రత్తగా గమనించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు ఉన్నతాధికారులకు సూచించారు. పొరపాటు చేసి తర్వాత సరిదిద్దుకోవటం వద్దని, పొరపాటు జరగకుండా ముందే జాగ్రత్త పడాలన ఆయన సలహా ఇచ్చారు. ఈ తరహా పరిణామాలు మళ్లీ పునరావృతం కాకూడదని హెచ్చరించారు. కొసమెరుపు ఏమిటంటే,. జీవొలో విడుదల చేయడం లో తప్పు జరిగిందని హోంశాఖ కార్యదర్శి ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పారు.
మంత్రివర్గ సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రులు ఉన్నతాధికారులు పాల్ఘొన్నారు.
రాష్ట్రంలో టిడిపి-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘ఏడాది పాలన’పై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. రాజధాని అమరావతి అభివృద్దికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను చర్చించిన మంత్రివర్ఘం సీఆర్డీఏ తాజా నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది.ముఖ్యంగా 9 కీలకాంశాలను మంత్రివర్గంలో చర్చించారు.
మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..
- అమరావతిలో రెండో దశ భూసేకరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- అమరావతిలో 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం
- వైఎస్ఆర్ జిల్లా పేరును ‘వైఎస్ఆర్ కడప’ జిల్లాగా మారుస్తూ తీసుకువచ్చిన ఉత్తర్వులకు ఆమోదం
- రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో దాదాపు రూ.5.75 కోట్లు
- కుప్పం నియోజకవర్గంలో రూ. 8.22 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు ఆమోదం
- పలు సంస్థలకు భూకేటాయింపులు, రాయితీల కల్పనపై చర్చించి.. ఆ ప్రతిపాదలనకు ఆమోదం
- పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నింబధనల సవరణలకు గ్రీన్ సిగ్నల్
- ఏపీ షాప్స్ ఆండ్ ఎస్టాబిలిష్ మెంట్ బిల్లు 2025 చట్టంలో నింబధనల సవరణలకు ఆమోదం
- ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్
- 248 కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదం
- మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్ట సవరణకు ఆమోదం,రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం
మంత్రుల పనితీరుపై సీఎం సమీక్ష
శాఖల వారీగా మంత్రుల పనితీరుపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భేటీలో సమీక్షించారు.కొందరి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.విపక్షం చేస్తున్న విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని ,మరింత దూకుడుగా వెళ్లాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు.ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా మంత్రులు పనిచేయాలని , ప్రజలలో మమేకం కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు.వైసీపీ నేతలపై కేసుల విషయం కూడా కొందరు మంత్రులు ప్రస్తావించగా , తప్పుచేసిన వారు ఎవరైనా వదిలేది లేదని , అయితే రాజకీయ కక్ష సాధింపు ఉండదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.రాష్టంలో తాజా రాజకీయాలపైనా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించారు. వైసీపీ నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారాన్ని ,నేరస్తులను పరామర్శిస్తున్నారని ,అన్నింటిని సమర్థంగా తిప్పికొట్టాలని సీఎం సూచించారు.
అమరావతిపై విస్తృత చర్చ
రాజధాని అమరావతి పనులపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అమరావతిలో రెండో దశ భూసేకరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దానితోపాటు అమరావతిలో 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ హబ్ నిర్మాణంపై మంత్రివర్ఘంలో చర్చించారు..