
ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల హబ్గా ఆంధ్రప్రదేశ్
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0(2025–2030) మీద సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు.
రక్షణ, అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు ఆకట్టుకునేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశా నిర్థేశం చేశారు. సోమవారం సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 (2025–2030)పై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతనంగా తీసుకువచ్చే పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని స్పష్టం చేశారు. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత, నవీన ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ ఒక కేంద్రంగా మారేలా అధికారులు ప్రయత్నించాలన్నారు.
ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని, రానున్న రోజుల్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుందని చంద్రబాబు అన్నారు. ఈ తరహా సాంకేతికతను రక్షణపరంగా వాడుకోవడంతో పాటు.. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి, దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. దేశ రక్షణ, అంతర్గత శాంతి భద్రతలకు సంబంధించి భవిష్యత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని సీఎం అన్నారు. ఈ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు నూతన పాలసీ దోహదపడాలని వీటిని దృష్టిలో ఉంచుకొని రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నేషనల్ సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇచ్చేలా పలు మార్పులు సూచించారు. ఏరో స్పేస్, డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు.
ఏరో స్పేస్, డిఫెన్స్ రంగంలోని ఎంఎస్ఎంఈలను ప్రత్యేకంగా ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీని కోసం ఏడాదికి ప్రత్యేకంగా రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతో పాటు, లాజిస్టిక్స్ సబ్సిడీ వంటివి నూతన పాలసీలో పొందుపర్చాలని సూచించారు. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడంతో పాటుగా వాటికి అనుంబంధ పరిశ్రమలలో ఉత్పత్తుల నాణ్యతలో బెంచ్మార్క్ ఉండేలా చూడాలన్నారు. అదేవిధంగా వాల్యూ యాడెడ్ జోడింపు జరగాలన్నారు. మార్కెటింగ్–బ్రాండింగ్ ముఖ్యమని, వన్ ఫ్యామిలీ– వన్ ఎంట్రప్రెన్యూర్ ఆశయం సాకారం కావాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
విశాఖపట్నం–శ్రీకాకుళంలో నావల్ క్లస్టర్.... జగ్గయ్యపేట–దొనకొండ ప్రాంతాల్లో మిస్సైల్, ఆయుధాల ఉత్పత్తులు.. కర్నూలు–ఓర్వకల్లు ప్రాంతంలో మానవ రహిత విమానాలతో పాటుగా డ్రోన్ల తయారీ.. లేపాక్షి–మడకశిర క్లస్టర్ ప్రాంతంలో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తిరుపతిని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలన్నారు. అలాగే డీఆర్డీవో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ నెలకొల్పాలని సీఎం చంద్రబాబు సూచించారు. లేపాక్షి–మడకశిర క్లస్టర్లో భారత్ ఫోర్జ్, ఎంఎండబ్లు్య సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, వాణిజ్య–పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ పాల్గొన్నారు.
Next Story