‘మా మామకి ఓటేయవద్ద’న్న అంబటి అల్లుడు..‌
x

‘మా మామకి ఓటేయవద్ద’న్న అంబటి అల్లుడు..‌

అంబటి రాంబాబుకు ఓటేయొద్దంటూ ఆయన అల్లుడు గౌతమ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ముద్రగడ కూతురు వీడియో తర్వాత గౌతమ్ వీడియా రావడంతో కీలకంగా మారింది.


ఆంధ్రలో గెలుపే లక్ష్యంగా టీడీపీ, వైసీపీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీకి ఒకదారి తర్వాత ఒకటిగా షాక్‌లు తగులుతున్నాయి. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం చర్యలను, పవన్‌కు ఆయన విసిరిన సవాల్‌ను ఆయన కూతురు క్రాంతి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ అంశం చల్లారక ముందే వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబుకు ఓటెయ్యద్దంటూ ఆయన అల్లుడు గౌతమ్ ఓ వీడియోను విడుదల చేశారు. ఎట్టిపరిస్థితుల్లో అంబటి రాంబాబుకు ఓటెయ్యొద్దని తన వీడియోలో వివరించారు. తన మామ అలాంటి భయంకరమైన, నీచమైన వ్యక్తి మరొకరు ఉండరంటూనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

గౌతమ్ ఏమన్నారంటే..

‘‘నా పేరు డాక్టర్ గౌతమ్. నేను అంబటి రాంబాబు అల్లుడిని.. అది నా దురదృష్టం ఎవరూ ఏం చేయలేరు. ఎంతో ఆలోచించి.. నా బాధ్యత అనుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నా. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిదృడు, శవాలపైన పేళాలు వెరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. ఇలాంటి మరో వ్యక్తి నా జీవితంలోకి రాకుండా చూడమని రోజూ పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు దేవుడిని కోరుకుంటాను. అంత భయంకరమైన వ్యక్తి అంబటి రాంబాబు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే.. ఇప్పుడు ఆయన పోటీ చేయబోతున్న పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్‌కు అయితే మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలో అలాంటి పోస్ట్. అందరికీ అన్నీ వందశాతం ఉండాలని లేదు.. కానీ వీటిలో ఏదీ కూడా ఆఖరికి 0.00 శాతం కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తున్నామంటే.. మనకు తెలయకుండానే కొన్నిటికి ప్రోత్సాహం ఇస్తున్నట్లు అవుతుంది. అంబటి రాంబాబుకు ఓటేయడం అంటే.. ఎవరైతే సిగ్గులేకుండా పెద్దగా అబద్దం చెప్పినా దాన్ని నిజం చేయొచ్చన్న కాన్ఫిడెన్స్‌తో సమాజంలో బతుకుతారో అలాంటి వారికి, ఎలాంటి లేకి పని చేసైనా సమాజంలో హుందాగా బతికేయొచ్చు అని అనుకునే వారికి ఓటేస్తున్నట్లు. ఏదైనా చేసి సిగ్గులేకుండా సిగ్గులేని తనాన్ని ప్రరోత్సహించొచ్చు అనుకునే వాళ్లకి ఓటేస్తున్నట్లు. ఇలాంటి వ్యక్తులకు ఓటేస్తే సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి ఓటర్లు బాధ్యతతో ఓటేసి సరైన నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తున్నా’’అని ఆయన తన వీడియోలో వెల్లడించారు.


ఇదంతా ప్రతిపక్షాల కుట్ర

అయితే నిన్న ముద్రగడ పద్మనాభం కూతురు జ్యోతి, ఈరోజు అంబటి రాంబాబు అట్టుడు గౌతమ్ వీడియోలు విడుదల చేయడంపై వైసీపీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు పన్నుతున్న కుట్ర అని, కుటుంబీకులను బెదిరించి ఇలాంటి వీడియోలను చేయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అయితే వీటిపై ఇప్పటివరకు ప్రతిపక్షాలు మాత్రం స్పందించలేదు.

Read More
Next Story