
భగ్గుమన్న అమరావతి మహిళలు
సాక్షి టీవీ చానల్ నిర్వహించిన చర్చ వివాదానికి దారి తీసింది.
అమరావతి ప్రాంతంలోని పలువురు మహిళలు తమను కించపరిచేలా సాక్షి టీవీలో శనివారం ఉదయం నిర్వహించిన చర్చా వేదికలో వ్యాఖ్యలు చేశారని ఆందోళనలకు దిగారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి టీవీలో శనివారం ఉదయం నిర్వహించిన చర్చలో మరో సీనియర్ జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని, ఎయిడ్స్ రోగులు కూడా ఎక్కువుగానే ఉన్నారని, ఈ నేపథ్యంలో ఎయిడ్స్ను కంట్రోల్ చేసేందుకు దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు పని చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఇంకా తన మాటలను కొనసాగిస్తూ.. అమరావతి దేవతల రాజధాని అని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారని.. నిజంగా చెప్పాలంటే హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. దేవతల రాజధాని అమరావతి ఎక్కడో పైన ఉంటుంది. అది ఇంద్రలోకమో.. ఇంకొకటో కావచ్చు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేశ్యలకు రాజధానిగా మారిన అమరావతిని ఇంద్రలోకం అనడం సబబు కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడ ఉన్నారంటే.. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పలేకపోతే.. మనం సమాజానికి ద్రోహం చేసినట్లు అవుతుంది. దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు సెక్స్ వర్కర్ల కోసం పని చేస్తున్నాయి. అంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా దీనిని దేవతల రాజధాని అనడం మానుకోవాలి అని మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలను అమరావతి ప్రాంతపు మహిళలు తీవ్రంగా తప్పుబట్టాయి. తీవ్ర ఆగ్రహ్యం వ్యక్తం చేస్తూ అమరావతి ప్రాంతంలో నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. జర్నలిస్టు కృష్ణంరాజు ఫొటోను చెప్పులతో కొట్టారు.