
విజయవాడ సాక్షి కార్యాలయంపై దండెత్తిన మహిళలు
సాక్షి బోర్డును కూల్చివేసి కాళ్లతో తొక్కుతూ, చెప్పులతో కొడుతూ నిరసనలు తెలిపారు.
సాక్షి చర్చలో కించపరిచే వ్యాఖ్యలు చేశారని విజయవాడలోని సాక్షి కార్యాలయంపైకి అమరావతి మహిళలు, అమరావతి రైతులు సోమవారం దండెత్తారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కార్యాలయం భద్రతా సిబ్బంది గేట్లకు తాళాలు వేయడంతో గేట్లను ఎక్కి లోపలికి దూకేందుకు ప్రయత్నం చేశారు. కార్యాలయం ముందు గోడకు ఉన్న సాక్షి బోర్డును లాగిపడేశారు. రోడ్డుపైన వేసి కాళ్లతో తొక్కారు. చెప్పులతో కొట్టారు. సాక్షి మీడియాకు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతి మహిళలకు, అమరావతి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సాక్షి కార్యాలయం ఉన్న విజయవాడ ఆటోనగర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సాక్షి టీవీ చానెల్లో రెండు రోజుల క్రితం నిర్వహించిన ఓ చర్చ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి మహిళలపై తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని అమరావతి మహిళలు, అమరావతి రైతులు రోడ్లెక్కారు. రాజధాని అమరావతి ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి వర్గాలు ఆందోళనలు చేపట్టారు. సాక్షి టీవీలో చర్చ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు చర్చలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజులపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీనిపైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లతో పలువురు మంత్రులు సీరియస్ అయ్యారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో విజయవాడలోని సాక్షి కార్యాలయాన్ని ముట్టడించాలని అమరావతి మహిళలు, టీడీపీ శ్రేణులు నిర్ణయించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, ఆయన సతీమణి, ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ నేతృత్వంలో పెద్ద ఎత్తున అమరావతి మహిళలు, అమరావతి రైతులు, టీడీపీ శ్రేణులు విజయవాడ సాక్షి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంపై నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు లోపలికి వెళ్లనీకుండా భద్రత సిబ్బంది సాక్షి కార్యాలయం గేట్లకు తాళాలు వేశారు.
ఈ క్రమంలో ఆందోళనకారులు గేట్లు ఎక్కి కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే వారిని లోపలికి వెళ్లనీకుండా పోలీసులు అడ్డుకున్నారు. సాక్షి బోర్డును కూల్చివేశారు, రోడ్డుపైన పడేసి చెప్పులతో కొడుతూ.. కాళ్లతో తొక్కుతూ తమ నిరసనలు వ్యక్తం చేశారు. సాక్షి యాజమాన్యం, సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతిరెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సాక్షి కార్యాలయం ఉన్న విజయవాడ ఆటోనగర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story