పూజకు అనుమతించండి..జైలు అధికారులకు పీఎస్‌ఆర్‌ వినతి
x

పూజకు అనుమతించండి..జైలు అధికారులకు పీఎస్‌ఆర్‌ వినతి

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు, లిక్కర్‌ స్కాంలో అరెస్టైన రాజ్‌ కసిరెడ్డికి పక్కపక్క నంబర్లు కేటాయించారు.


ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తనను పూజ చేసుకునేందుకు అనుమతించాలని జైలు అధికారులను కోరారు. సంధ్యావందనం చేసుకుంటానని, దానికి అనుమతి ఇవ్వాలని, సంధ్యావందనం అవసరమైన పూజా సామాగ్రిని తీసుకెళ్లేందుకు కూడా పర్మిషన్‌ ఇవ్వాలని పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు జైలు అధికారులను కోరారు. దీనిపైన స్పందించిన జైలు అధికారులు ఈ విషయాన్ని జైళ్ల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆంజనేయులుకు తెలిపారు. ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో విజయవాడ జైలుకు తరలించిన నేపథ్యంలో సంధ్యావందనం చేసుకునేందుకు అవసరమైన పూజా సామాగ్రిని తీసుకెళ్లేందుకు ఆంజనేయులు ప్రయత్నించారు. అయితే వాటిని తీసుకెళ్లేందుకు వీల్లేదని జైలు అధికారులు నిరాకరించారు.

ఈ క్రమంలో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఉన్న విజయవాడ జైలును సందర్శించేందుకు జైళ్ల శాఖ డీఐజీ వెళ్లారు. ఈ నేపథ్యంలో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సంధ్యావందనం పూజ చేసుకునే విషయంతో పాటు అందుకు కావలసిన సామాగ్రిన అనుమతించే విషయం గురించి ఆ జైళ్ల శాఖ డీఐజీ దృష్టికి జైలు అధికారులు తీసుకెళ్లారు. దీనిపై పై అధికారులతో చర్చించి చెబుతానని డీఐజీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సంధ్యావందనం చేసుకునేందుకు, అందుకు అవసరమైన సామాగ్రి తెచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
విజయవాడ జైల్లో ఉన్న పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుతో పాటు లిక్కర్‌ స్కాంలో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కసిరెడ్డి కూడా ఇదే జైల్లోనే ఉన్నారు. వీరిద్దరికి జైలు అధికారులు పక్క పక్క ఖైదీ నంబర్లు కేటాయించారు. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు ఖైదీ నంబంర్‌ 7814ను కేటాయించగా, రాజ్‌ కసిరెడ్డికి 7813 ఖైదీ నంబర్‌ను కేటాయించారు. మరో వైపు రాజ్‌ కసిరెడ్డిన కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీనిపై కోర్టు ఏ విధమైన ఆదేశాలు జారీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపైన కూడా పోలీసులు కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. పీఎస్‌ఆర్‌ అంజనేయులు విచారణకు సహకరించడం లేదని, ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, అందువల్ల పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటీషన్‌లో సీఐడీ పోలీసులు పేర్కొన్నారు. దీనిపైన కూడా ఈ రోజు విచారణ జరగనుంది. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును పోలీసులు కోరిన విధంగా కస్టడీకి అప్పగిస్తారా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
Read More
Next Story