విశాఖపట్నంలో శుక్రవారం ఓ ప్రత్యేకత సంతరించుకుంటోంది. రాష్ట్ర పాలనలో కీలకమైన ముగ్గురు ముఖ్య నేతలు విశాఖను వేదికగా చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సీఎం తనయుడు, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్లు ముగ్గురూ నగరంలో ఉంటున్నారు. వీరు పాల్గొనే కార్యక్రమాలు వేర్వేరు అయినప్పటికీ ఒకేసారి వీరు విశాఖలో ఉండడంతో ప్రాధాన్యత ఏర్పడింది. సేనతో సేనాని పేరిట జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం నుంచి మూడు రోజులు విశాఖలో ఆ పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి గురువారం ఉదయమే విశాఖ చేరుకున్నారు. ఆయన ఈ మూడు రోజులూ విశాఖలోనే గడపనున్నారు. సేనతో సేనాని కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పవన్ కల్యాణ్ జనసేన పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తలు, ఆహ్వానితులతో సమావేశమవుతారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ కూడా గురు, శుక్ర, శనివారాల్లో విశాఖలోనే గడపనున్నారు. ఆయన తన నివాసం నుంచి గురువారం రాత్రికి విశాఖ చేరుకుంటారు. ఇక శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విశాఖ చేరుకోనున్నారు. తండ్రీ తనయులు ఇద్దరూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా చంద్రబాబు శుక్రవారం సాయంత్రం, లోకేష్ శనివారం మధ్యాహ్నం తిరిగి పయనమవుతారు. ఈ ఏడాది జూన్ 21న జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని హాజరైన సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు ఒకేసారి వచ్చారు. ఇప్పుడు మళ్లీ ఈ ముగ్గురు కీలక నేతలూ ఒకేరోజు విశాఖలో ఉండడం చర్చనీయాంశమైంది.
సీఎం చంద్రబాబు పర్యటన ఇలా..
ఒకరోజు పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం విశాఖ వస్తున్నారు. ఉదయం 10 గంటలకు తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.15 గంటలకు విశాఖలోని నేవల్ కోస్టల్ బ్యాటరీ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి నోవాటెల్ హోటల్కు వెళ్తారు. అక్కడ జరిగే ఇండియా ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ సమ్మిట్లో పాల్గొంటారు. అనంతరం రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగే గ్రిఫిన్ ఫౌండర్ నెట్వర్క్స్ సమావేశానికి హాజరవుతారు. అది ముగించుకుని విశాఖ విమానాశ్రయానికి చేరుకుని విమానంలో బెంగళూరు, అక్కడ నుంచి కుప్పం పర్యటనకు వెళ్తారు.
మంత్రి లోకేష్ షెడ్యూలు ఇదీ..
మంత్రి నారా లోకేష్ గురువారం రాత్రి 8.20 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రికి నగరంలోని రామ్నగర్ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో బస చేస్తారు. శæుక్రవార ం ఉదయం 10 గంటలకు వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే అర్థ సమృద్ధి 2025 ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. అనంతరం మధురవాడ చంద్రంపాలెం హైస్కూలులో ఏఐ ల్యాబ్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రారడిసన్ బ్లూ రిసార్ట్లో ఏఐ ల్యాబ్స్ను వర్చువల్గా ప్రారంభిస్తారు. ఆ తర్వాత నోవాటెల్ హోటల్లో ఎయిరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్పై సీఐఐ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాలులో జరిగే స్పోర్ట్స్ మీట్కు హాజరవుతారు. ఆరు గంటలకు రాడిసన్ బ్లూ రిసార్టులో భారత మహిళా క్రికెట్ జట్టుతో మర్యాద పూర్వకంగా భేటీ అవుతారు. రాత్రికి ఎన్టీఆర్ భవన్లో బస చేస్తారు. శనివారం మధ్యాహ్నం వరకు విశాఖలోనే ఉండి ఆపై విజయవాడకు విమానంలో పయనమవుతారు.
అధికార యంత్రాంగం హైరానా..
మరోవైపు ముఖ్యమంత్రి, మరోమంత్రి లోకేష్ ఒకే రోజు విశాఖ పర్యటన, ప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ సమీక్షలు విశాఖలోనే నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం నానా హైరానా పడుతోంది. ఒకపక్క భద్రతా ఏర్పాట్లు, మరోపక్క ఆయా కార్యక్రమాల నిర్వహణకు తీసుకోవలసిన చర్యలపై పోలీసులు, అధికారులు బిజీబిజీగా ఉన్నారు.