
అందరి చూపు..గుంటూరు మేయర్ వైపు
నేడు గుంటూరు మేయర్ పదవికి ఎన్నకలు జరగనున్నాయి.
గుంటూరు మేయర్ ఎన్నిక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. అధిక కార్పొరేటర్లను గెలుచుకున్న వైసీపీ తిరిగి గుంటూరు మేయర్ పదవిని దక్కించుకుంటుందా? తక్కువ కార్పొరేటర్లు ఉన్న కూటమి కైవసం చేసుకుంటుందా? అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మకమైన గుంటూరు మేయర్ పదవికి సోమవారం ఎన్నికల జరగనున్నాయి. సిట్టింగ్ మేయర్ కావటి మనోహర్ నాయుడు తన మేయర్ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యంగా మారింది.
గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్కు గత ఎన్నికల్లో ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. అధిక స్థానాలను గెలుచుకోవడంతో పాటు మేయర్ పదవిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తక్కువ స్థానాల్లో కూటమి భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన పార్టీలు చేజిక్కించుకున్నాయి. గుంటూరు కార్పొరేషన్లో పార్టీల పరంగా బలాబలాలు చూస్తే.. 46 మంది కార్పొరేటర్లు వైసీపీకి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కేవలం 9 మందే ఉన్నారు. ఇక జనసేనకు ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. ఎన్నికలు ఫేర్గా జరిగితే గుంటూరు మేయర్ పదవి సంఖ్యా బలం తక్కువ ఉన్న కారణంగా కూటమి కంటే బలం ఎక్కువ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే తిరిగి దక్కాలి. కానీ కూటమి అధికారంలో ఉండటంతో ఈక్వేషన్లు అన్నీ మారి పోయాయి. 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ రాజకీయాలు మారిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లు చాలా మంది ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేనలోకి వెళ్లి పోయారు. దాదాపు 19 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలోకి చేరారు. కూటమి భాగస్వామ్య పార్టీలు టీడీపీ, జనసేన బలం పెరిగింది.
నిన్నటి వరకు సైలెంట్గా ఉన్నా వైసీపీ సోమవారం ఉదయం వ్యూహాత్మకంగా రంగంలోకి దిగింది. 30వ డివిజన్ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డితో సోమవారం మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కూటమి పక్షం నుంచి 37వ డివిజన్ కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర మేయర్ పదికి పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వాకటి మనోహర్నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆదివారం వరకు సైలెంట్గా ఉండటంతో గుంటూరు మేయర్ పదవి ఏకపక్షమే అవుతుందని, కూటమి కైవసం చేసుకుంటుందని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ వైసీపీ ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయ వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. మరో వైపు వైసీపీ విప్కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో గుంటూరు మేయర్ ఎన్నిక ఆసక్తి కరంగా మారింది.
Next Story