ఏజెన్సీ ఏరియాలో బంద్‌–స్పెషల్‌ డీఎస్సీకి ఆదివాసీలు డిమాండ్‌
x

ఏజెన్సీ ఏరియాలో బంద్‌–స్పెషల్‌ డీఎస్సీకి ఆదివాసీలు డిమాండ్‌

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు వస్తున్న వేళ ఆదివాసీలు బంద్‌ చేపట్టారు.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు వస్తున్న సమయంలో ఆదివాసీల కోసం ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని కోరుతూ మన్యంలో బంద్‌ చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆదివాసీ డిఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక డిఎస్సీ కోసం శుక్రవారం బంద్‌ను చేపట్టారు. దీనికి ఆదివాసీ ప్రజలు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని స్పెషల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ డిఎస్సీ సాధన సమితి పిలుపు మేరకు మన్యం ప్రాంతాలలో బంద్‌ను పాటించారు. పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు కూడా బంద్‌ సందర్భంగా సంస్థలను మూసివేశారు.

ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ కూడా దీనికి మద్దతు ప్రకటించింది. పాడేరులో చేపట్టిన బంద్‌ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, సాధన సమితి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు వంద శాతం ఆదివాసీలకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దీని మీద ఇది వరకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆ మాట ప్రకారం జీవో నంబరు 3ను సీఎం చంద్రబాబు అమలు చేయాలని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఒక వేళ అలా చేయని పక్షంలో జీవో నంబరు 3కు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరారు. ఏజెన్నీ ప్రాంతాల్లో 776 ఉపాధ్యాయ పోస్టులకు కేవలం 42 పోస్టులు మాత్రమే ఆదివాసీలకు దక్కుతున్నాయని, ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీ వేయాలని కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును కోరారు.
Read More
Next Story