ప్రమాదమా? హత్యా?
x

ప్రమాదమా? హత్యా?

కాలువలో పడిన ఘటనలో వివాహిత మృతి చెందగా 7 నెలల శిశువు గల్లంతు అయ్యాడు.


పల్నాడు జిల్లా నరసరావుపేటలో అనుమానాస్పద ఘటన కలకలం రేపింది. రొంపిచర్ల మండలం కొత్తపాలెంకు చెందిన శ్రీకాంత్, తన అనారోగ్యంతో బాధపడుతున్న 7 నెలల కుమారుడు శరత్, భార్య త్రివేణి (25)తో శుక్రవారం రాత్రి నరసరావుపేటలోని ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అయితే బొలెరో వాహనం అడ్డొచ్చి ప్రమాదం చోటుచేసుకుందని భర్త శ్రీకాంత్ చెబుతున్నాడు. మార్గమధ్యంలో కాలువ వద్ద ఒక బొలెరో వాహనం ఎదురుపడడంతో దాన్ని తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి కాలువలో పడిపోయిందని దీంతో భార్య త్రివేణి, కుమారుడు శరత్ కాలవలో పడిపోయారని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

త్రివేణి మృతి – శరత్ గల్లంతు

గాలింపులు అనంతరం భార్య త్రివేణి మృతదేహం కాలువలోనే లభ్యమైంది. అయితే చిన్నారి శరత్ బాడీ మాత్రం కనిపించలేదు. దీంతో పోలీసుల రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి.

ఇది హత్యే

ఇది ప్రమాదం కాదు హత్యే అని భార్య త్రివేణి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి అనేక కారణాలు చూపిస్తున్నారు. ఆమె శరీరంపై అనుమానాస్పద గాయాలు ఉన్నాయని, హత్య చేసి ప్రమాదంగా భర్త శ్రీకాంత్ చెబుతున్నాడని ఆరోపరణలు చేస్తున్నారు. సమగ్ర విచారణ చేసి, నిజాలను బయటపెట్టి న్యాయం చేయాలని వారు పోలీసులను కోరుతున్నారు.

విచారణలోకి పోలీసులు

ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద కారణాలు, బొలెరో వాహనం వివరాలు, భార్య త్రివేణి మరణం, కుమారుడు శరత్ గల్లంతుకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read More
Next Story