
సైబర్ నేరాల నియంత్రణకు బలమైన వ్యవస్థ అవసరం
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు.
బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకులు మోసపోతున్నారని, అటు వంటి సైబర్ నేరాల నుంచి అమాయకులను కాపాడేందుకు బలమైన చట్టాలు, వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయపడినట్లు ఆ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘు రామకృష్ణ రాజు తెలిపారు. ఈ అంశంపై ప్రజలను, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాగాన్ని అప్రమత్తం చేసేందుకు వచ్చే శాసన సభ సమావేశాల్లో చర్చ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
గురువారం రాష్ట్ర శాసన సభ భవనం తన ఛాంబరులో కమిటీ సభ్యులు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణు కుమార్ రాజుతో కలసి ఆయన మాట్లాడారు. భీమవరం నుండి తమ పిటీషన్స్ కమిటీకి ఒక ముఖ్యమైన పిటిషన్ వచ్చిందన్నారు. ఆ పిటీషన్ పై శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ద్వారా జరిగే సైబర్ క్రై మ్స్ రోజు రోజుకి పెరిగిపోతూ ప్రజల జీవితాలు తారు మారు అయిపోతున్నాయన్నారు. వీటి నియంత్రణకు ఉన్న చట్టాలు, వాటిలో తీసుకురావాల్సిన మార్పులు, పోలీస్ శాఖ చేస్తున్న కృషి తదితర అంశాలపై కూలంకషంగా చర్చించడం జరిగిందన్నారు. సైబర్ నేరాల ద్వారా ప్రజలు మోసపోకుండా, ఆత్మ హత్యలు చేసుకోకుండా చూసేందుకు శాసన సభ ద్వారా సైబర్ చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సైబర్ పోలీస్ స్టేషన్లను కూడా పెంచాల్సి ఉందన్నారు. సాంకేతిక నిపుణులతో పటిష్టమైన నియంత్రణా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రముఖుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ విషయాలపై మరింత లోతుగా చర్చజరిపి తగిన చర్యలు తీసుకునే విధంగా వచ్చే నెల 18 వ తేదీన జరుగనున్న పిటిషన్ల కమిటీ సమావేశానికి ఐటీ నిపుణులు, హోం శాఖ ఉన్నతాదికారులు కూడా హాజరు కావాలని కోరినట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు.