
సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు ముందడుగు!
జోన్ తొలి జీఎంగా సందీప్ మాథుర్ను రైల్వే బోర్డు నియమించింది. ఇప్పటికే విశాఖలో జోన్ కార్యాలయ పనులు ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రకటన జరిగి ఆరేళ్లు దాటింది. అధికార, ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన ఈ రైల్వే జోన్పై కేంద్రం శ్రద్ధ చూపడం మానేసింది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా కేంద్రం జోన్ పురోగతిని పట్టించుకోకుండా నాన్చివేత ధోరణిని ప్రదర్శించింది. దీంతో జోన్ ప్రకటన అయితే జరిగింది గానీ ఆపై అతీగతీ లేకుండా పోయింది. రైల్వే బోర్డు ఆలస్యంగా.. అనూహ్యంగా ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు కొత్త జీఎంను ప్రకటించింది.
విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నమూనా భవనం
2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేసింది. అనంతరం కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. జోన్ ప్రధాన కార్యాలయం కోసం అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ నగరంలోని ముడసర్లోవ వద్ద 52.2 ఎకరాలను కేటాయించింది. అయితే ఈ స్థలం అప్పగింతలో జాప్యం జరిగింది. ఈ భూములపై రైతులతో ఉన్న వివాదాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక పరిష్కరించింది. దీంతో ఆ భూములను రైల్వే శాఖకు అప్పగింత పూర్తయింది. ఈ నేపథ్యంలో జనవరి 8న ప్రధాని మోదీ జోన్ ప్రధాన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.149 కోట్లతో తొమ్మిది అంతస్తుల్లో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి ఇటీవల టెండర్లు పిలిచారు. బీసీ భుయాన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులు అప్పగించారు. దీంతో సదరు కంపెనీ ఈ మధ్యనే పనులు మొదలు పెట్టారు. ఈ పనులు పూర్తి కావడానికి మరో రెండేళ్లయినా పడుతుంది.