బుద్ధిమాంద్యం పిల్లలకు మానసిక విద్యా దీపం!
x
విశాఖలో హిడెన్‌ స్ప్రౌట్స్‌ స్కూలు

బుద్ధిమాంద్యం పిల్లలకు మానసిక విద్యా దీపం!

హిడెన్‌ స్ప్రౌట్స్‌ పేరిట విశాఖ వాసి ఓ బడిని స్థాపించారు. అమ్మానాన్నల బాధ్యతను ఆయన తన భుజాలకెత్తుకున్నారు. ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పుతున్నారు.


ఆ పిల్లలకు లోకం అంటే ఏమిటో తెలియదు. అన్నెం పున్నెం, మాయ, మర్మం అసలే ఎరుగరు. తామేం చేస్తున్నామో కూడా తెలుసుకోలేరు. తమ భవితవ్యం పైన, బతుకుదెరువు పైనా ధ్యాస పెట్టలేరు. వయసు మీద పడుతున్నా ఆ స్పృహ వారిలో మచ్చుకైనా కానరాదు. యుక్త వయసు వచ్చినా ఇంకా చిన్న పిల్లలు మాదిరిగానే ప్రవర్తిస్తుంటారు. ఆ పిల్లలు తమకు భారమైనా ఆ తల్లిదండ్రులు పేగు బంధాన్ని వదులుకోలేరు. అందరి బిడ్డల్లా వీరిని స్కూళ్లకు పంపి చదివించే అవకాశం లేరు. ఇలాంటి వారి కోసం ఓ మానవతామూర్తి ఒక స్కూలునే ఏర్పాటు చేశారు. అక్కడ ఏళ్ల తరబడి ఉచితంగా విద్యతో పాటు భోజనం కూడా అందిస్తున్నారు. వారిలో బుద్ధి మాంద్యాన్ని తొలగించి మానసిక వికాసాన్ని పెంపొందించడానికి పాటుపడుతున్నారు. ఇంతకీ ఆయనేమీ కోటీశ్వరుడు కాదు.. సాదాసీదా మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు. బంగారం, ఆస్తులు అమ్మి ఆ మహా సంకల్పానికి పూనుకున్నారు. ఆ మహనీయుని పేరు కండిపల్లి శ్రీనివాసరావు.. ఊరు విశాఖపట్నంలోని పెదవాల్తేరు.

విద్యాబోధన సాగిస్తున్న బుద్ధిమాంద్యం పిల్లలు

దాదాపు పాతికేళ్ల క్రితం విశాఖ స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో అంగవైకల్యం ఉన్న పిల్లల కోసం ఓ సెమినార్‌ జరిగింది. ఆ సదస్సుకు చాలామంది తల్లిదండ్రులు బుద్ధిమాంద్యంతో ఉన్న పిల్లలను తీసుకొచ్చారు. అలాంటి బిడ్డలతో ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన. పిల్లల పరిస్థితి కండిపల్లి శ్రీనివాసరావును కదిలించింది. కొంతమంది అమ్మానాన్నలతో శ్రీనివాసరావు మాట్లాడితే.. ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాధ. బుద్ధిమాంద్యంతో ఉన్న పిల్లలను వదిలి ఉపాధికి వెళ్లలేని వారు కొందరు. వారిని నిరంతరం కంటికి రెప్పలా కాపలా కాస్తున్న వారు ఇంకొందరు. పెంచలేకపోతున్న వారు, బడికి పంపించే వీలు లేని వారు, వారే సర్వస్వంగా బతుకుతున్న వారు మరికొందరు. వారి దయనీయ పరిస్థితులకు చలించిన శ్రీనివాసరావు ఇలాంటి పిల్లల కోసం ఓ పాఠశాల ఏర్పాటు చేసి, ఉచితంగా విద్యాబోధన చేయాలన్న నిర్ణయానికొచ్చారు.

బాలుడికి తల్లిలా అన్నం తినిపిస్తూ..

తొలుత ఆరుగురు పిల్లలతో..
దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం 2006 ఏప్రిల్‌లో తన ఇంటికి సమీపంలో బుద్ధి మాంద్యం గల ఆరుగురి పిల్లలతో తొలుత ‘హిడెన్‌ స్ప్రౌట్స్‌’ అనే పేరుతో చిన్న పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆరంభంలో ఈ పిల్లలను వారింటి నుంచి తన బైక్‌పై స్కూలుకు తీసుకొచ్చి తీసుకెళ్లేవారు. క్రమంగా ఈ పిల్లల సంఖ్య పెరగడంతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సహకారంతో 2013లో ఎంవీపీ కాలనీలో ఖాళీగా, చెత్తాచెదారంతో ఉన్న జీవీఎంసీ స్థలాన్ని శుభ్రం చేసి, షెడ్లు వేసి అక్కడకు మార్చారు. 2021 నాటికి ఆ సంఖ్య 200కి చేరింది. వీరి కోసం నాలుగు బస్సులను దాతలు సమకూర్చారు. ఆ బస్సులను నగరంలోని సింహాచలం, గోపాలపట్నం, పీఎంపాలెం, భీమిలి తదితర ప్రాంతాలకు పంపి అక్కడ నుంచి ఈ పిల్లలను తీసుకొచ్చి పంపిస్తారు. కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన సమయంలోనూ ఈ స్కూలును విజయవంతంగా నడిపారు.

కంప్యూటర్‌ బోధన చేస్తూ..

విద్యతో పాటు ఇంకెన్నో నేర్పుతారు..
ఈ స్కూలులో బుద్ధిమాంద్యం పిల్లలకు విద్యతో పాటు మానసిక వికాసానికి మరెన్నో నేర్పుతారు. వారికి విద్యాబుద్ధులు నేర్పేందుకు, వారి ఆలనా పాలనా చూసేందుకు కూడా శిక్షణ పొందిన స్పెషల్‌ టీచర్లు ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరు పిల్లల సంరక్షణలోనే గడుపుతారు. వీరికి కంప్యూటర్‌ విద్యాబోధన చేస్తారు. ఫిజియోథెరపీ, స్పీచ్‌ థెరపీ, డ్యాన్స్‌ థెరపీ, యోగా, క్రాఫ్ట్‌ వర్క్, సంగీతంతో పాటు రన్నింగ్, వాకింగ్, షాట్‌ పుట్, త్రోబాల్‌ తదితర ఆటలు కూడా నేర్పుతారు. వీటిలో తర్ఫీదు పొందిన వారికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో బుద్ధిమాంద్యంతో ఉన్న పిల్లలకు నిర్వహించే పోటీలకు పంపుతారు. ఇలా ఈ స్కూలు పిల్లలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి ఛాంపియన్‌షిప్‌లు సాధించారంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు.. ఈ పిల్లలకు బుక్‌ బైండింగ్స్, జిరాక్స్‌ మిషన్‌లోనూ శిక్షణ ఇస్తారు. ఈ స్కూలులో సర్వమత పండగలు జరుపుకుంటారు. వివిధ ఫంక్షన్లకు కూడా ఈ పిల్లలను తీసుకెళ్తారు.

యోగాసనాలు చేస్తున్న బుద్ధిమాంద్యం పిల్లలు

ఉచితంగానే విద్యాబోధన..
ఈ హిడెన్‌ స్ప్రౌట్స్‌ స్కూలులో విద్యాబోధన, భోజనం, బస్సులో రాకపోకలు.. ఇలా అన్నీ ఉచితమే. ఒక్కో విద్యార్థి మానసిక స్థితికి అనుగుణంగా విద్యా బోధన సాగిస్తుంటారు. మధ్యాహ్నం రెండు కూరలు, బిర్యానీ, రైస్, పెరుగు, సాయంత్రం స్నాక్స్‌ పెడతారు. ఇలాంటి పిల్లలకు విద్యాబోధనకే ప్రత్యేక స్కూళ్ల వారు నెలకు రూ.10 వేల వరకు వసూలు చేస్తారు. కానీ ఈ హిడెన్‌ స్ప్రౌట్స్‌ స్కూలు నిర్వాహకులు తల్లిదండ్రుల నుంచి ఒక్క పైసా కూడా ఫీజు తీసుకోదు. ఈ స్కూలు నిర్వహణకు నెలకు సగటున రూ.4 లక్షలు ఖర్చవుతుంది. ఈ సొమ్మును దాతలు, కేంద్ర ప్రభుత్వం సోషల్‌ జస్టిస్‌ మిషన్‌ కొంత సమకూరుస్తుండగా, నెలకు రూ.లక్ష వరకు వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు భరిస్తారు. మూడు బస్సుల్లో ఒకదానిని దాత, మరో రెండింటిని హెచ్‌పీసీఎల్, ఎస్‌ఏఎల్‌పీజీ సంస్థలు సీఎస్సార్‌ నిధుల నుంచి ఇచ్చాయి. సుమారు 150 మంది పిల్లలకు టీచర్లు, ఇతర సిబ్బంది 30 వరకు ఉన్నారు.
వీరిని అదుపు చేయడం అంత ఈజీ కాదు మరి
పుట్టిన 18 రోజుల్లోపు పిల్లలు అరుదుగా బుద్ధిమాంద్యానికి (మెంటల్లీ రిటార్టెడ్‌కు) గురవుతారు. ఇది చికిత్సకు నయం కాదు. జీవితాంతం బుద్ధిమాంద్యంతో బాధపడాల్సిందే. ఈ పిల్లలను అదుపు చేయడం అంత ఈజీ కాదు. వారేం చేస్తున్నారో వారికే తెలియదు. కొందరు అరుపులు కేకలు వేస్తుంటారు. మరికొందరు వస్తువులను విసిరికొడ్తారు. యుక్త వయసు వచ్చినా చిన్న పిల్లల మాదిరిగానే ప్రవర్తిస్తుంటారు. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ చేసిన టీచర్లు ఇలాంటి వారిని నొప్పించకుండా అనునయిస్తూ అదుపు చేస్తుంటారు. వారిని దారిలోకి తేవడానికి ప్రేమగా మాట్లాడతారు. ఒక్కొక్కరిని హగ్‌ చేసుకుంటారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో స్కూల్‌ సీజ్‌..
శాపగ్రస్తులైన బుద్ధిమాంద్యం పిల్లల కోసం నడుపుతున్న ఈ స్కూలు నిర్వాహకులను గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌సీపీ నేతలు అవస్థల పాల్జేశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే సహకరిస్తున్నారంటూ అప్పటి ఎంపీ హోదాలో ఉన్న నేత ప్రోద్బలంతో ఆ పార్టీ నాయకులు జీవీఎంసీ స్థలంలో నడుస్తున్న ఈ స్కూలు సీజ్‌ చేసి ఉన్న ఫళంగా ఖాళీ పిల్లలను రోడ్డున పడేశారు. అంతేకాదు.. ఈ స్కూలు మరో చోట నడపనీయకుండా అడ్డుకున్నారు. దీంతో మరో చోట స్థలం వెతికి అక్కడ షెడ్లు వేసి నాలుగేళ్ల పాటు రోడ్డుపైనే ఈ పిల్లలకు భోజనాలు పెట్టారు. స్కూలు సీజ్‌ అవడంతో ఆ స్కూలులో ఉన్న కంప్యూటర్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జిలు, బస్సులు తుప్పు పట్టుకు పోయాయి. రూ.కోటి విలువైన ఫ్రిడ్జిలు, కంప్యూటర్లు, జెరాక్స్‌ మిషన్లు దొంగలు ఎత్తుకుపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగు నెలల క్రితం మళ్లీ మునుపటి జీవీఎంసీ స్థలంలో ఈ స్కూలు నడుపుకోవడానికి అనుమతించడంతో ఈ పిల్లలకు అవస్థలు తప్పాయి. అయితే ఈ స్కూలును సీజ్‌ చేసి రోడ్డున పడేయడంతో పిల్లల సంఖ్య 200 నుంచి 150కి పడిపోయింది.
ఆ తల్లిదండ్రులకు వరం.. హిడెన్‌ స్ప్రౌట్స్‌..
బుద్ధిమాంద్యం కలిగిన పిల్లల తల్లిదండ్రులకు హిడెన్‌ స్ప్రౌట్స్‌ స్కూలు ఒక వరంలా మారింది. ఈ పిల్లలను వదిలి ఉద్యోగం, ఉపాధి వంటి పంటి పనులకు, శుభకార్యాలకు సైతం వెళ్లలేని పరిస్థితి. ఇంట్లో ఉంటే వారి అల్లరి చేష్టలను అదుపు చేయడం ఎంతో కష్టతరంగా ఉంటుంది. ఈ ఉచిత స్కూలు అందుబాటులోకి రావడం విశాఖ, పరిసర ప్రాంతాల్లోని తమ బుద్ధిమాంద్యం బిడ్డలను ఈ స్కూలుకు పంపుతున్నారు. ‘హిడెన్‌ స్ప్రౌట్‌ స్కూలు మాలాంటి తల్లిదండ్రులుకు ఒక వరం. ఇంట్లో మేం పడే బాధలు ఆ స్కూల్లో పడుతున్నారు. పైగా వారిలో మానసిక వికాసానికి కృషి చేస్తున్నారు. మా బిడ్డని ఈ స్కూలుకు పంపి ఉపాధి పనులకు వెళ్తున్నాం. స్కూలు నిర్వాహకులకు రుణపడి ఉంటాం’ అని గోపాలపట్నానికి చెందిన రాజశేఖర్‌ అనే వ్యక్తి ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.

కండిపల్లి శ్రీనివాసరావు

స్కూలు కోసం బంగారం, స్థలాలు అమ్మి..
‘నేను విశాఖ బుల్లయ్య కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన సదస్సుకు బుద్ధిమాంద్యం పిల్లలతో తల్లిదండ్రులు హాజరయ్యారు. అక్కడ వారి బాధలు, పరిస్థితులు నన్ను కదిలించాయి. దీంతో ఇలాంటి పిల్లల కోసం ఓ స్కూలు నడపాలన్న ఆలోచన కలిగింది. ఇందుకోసం బీఈడీ, ఎంఆర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశాను. దాని ఫలితమే 20 ఏళ్ల క్రితం హిడెన్‌ స్ప్రౌట్స్‌ స్కూలు పుట్టుక. ఈ స్కూలు స్థాపనకు నా వద్ద ఉన్న 15 తులాల బంగారం, రెండు ఇంటి స్థలాలను విక్రయించాను. నా సంకల్పానికి మా కుటుంబ సభ్యులు సహకరించారు. బుద్ధిమాంద్యం పిల్లలకు విద్యాబోధన సాగించే అవకాశాన్ని దేవుడు నాకు ప్రసాదించాడన్న తృప్తి, ఆనందం నాలో ఉంది’ అని హిడెన్‌ స్ప్రౌట్స్‌ స్కూలు వ్యవస్థాపకుడు కండిపల్లి శ్రీనివాసరావు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
Read More
Next Story