రైల్వే రన్నింగ్‌ స్టాఫ్‌కి కార్పొరేట్‌ తరహా హోటల్‌!
x
హోటల్‌ను ప్రారంభిస్తున్న డీఆర్‌ఎం బోహ్రా

రైల్వే రన్నింగ్‌ స్టాఫ్‌కి కార్పొరేట్‌ తరహా హోటల్‌!

లోకోౖ పెలట్లు, గార్డులకు ఉచితం భోజనం వసతి సదుపాయం. తొలిసారిగా విజయనగరం స్టేషన్‌లో ఏర్పాటు.

రైళ్లలో విధులు నిర్వహించే లోకో పైలట్లు, గార్డుల కోసం ఓ మంచి ఆలోచన చేసింది తూర్పు కోస్తా రైల్వే. విధి నిర్వహణలో అలసి సొలసిన వీరికి విశ్రాంతి సమయంలో హాయి గొలిపే వసతితో పాటు రుచికరమైన భోజనం, రీడింగ్‌ రూమ్‌ సదుపాయాన్ని కల్పించింది. తూర్పు కోస్తా (ఈస్ట్‌ కోస్ట్‌) రెల్వే జోన్‌ పరిధిలో తొలిసారిగా విజయనగరం రైల్వే స్టేషన్లో హోటల్‌ (లాడ్జింగ్, బోర్డింగ్‌)ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. వివిధ ప్రయాణికుల రైళ్లు, గూడ్సు రైళ్లలో లోకో పైలట్లు, గార్డులు (వీరిని రన్నింగ్‌ స్టాఫ్‌గా వ్యవహరిస్తారు) విధులు నిర్వహిస్తుంటారు. అనంతరం డ్యూటీ దిగాక సమీపంలోని రైల్వే స్టేషన్లలో ఉన్న గదుల్లో విశ్రాంతి తీసుకుంటారు. ఎనిమిది గంటలు రెస్ట్‌ తీసుకున్నాక మళ్లీ విధులకు హాజరవుతారు. ఆ ఎనిమిది గంటలు రెస్ట్‌ తీసుకోవడానికి ఆయా స్టేషన్లలో తక్కువ విస్తీర్ణం, తక్కువ సంఖ్యలో, అరకొర సదుపాయాలతో ఇరుకుగా ఉన్న విశ్రాంతి గదుల్లో సేద తీరుతారు. వీరికి రైల్వే సిబ్బంది భోజనం వండి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఉత్తర రైల్వే జోన్‌ పరిధిలో మొట్టమొదటి సారిగా ఈ రన్నింగ్‌ స్టాఫ్‌ కోసం కార్పరేట్‌ తరహా లాడ్జింగ్‌ కమ్‌ బోర్డింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌లో విజయనగరం రైల్వే స్టేషన్‌లో ఇలాంటి హోటల్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనిని సోమవారం వాల్తేరు డివిజనల్‌ మేనేజర్‌ లలిత్‌ బోహ్రా ప్రారంభించారు. ఈ తరహా హోటళ్లలో ఆధునిక సదుపాయాలు, సౌకర్యవంతమైన వసతి రన్నింగ్‌ స్టాఫ్‌ మనోస్థైర్యాన్ని పెంచడంతో పాటు సంక్షేమం, వారిలో నిబద్ధత, పనితీరును మరింత మెరుగు పరుస్తుందని పేర్కొన్నారు. వీటి నిర్వహణ ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడం వల్ల సేవా నాణ్యత, పరిశుభ్రత పెంపొందుతుందని చెప్పారు.


కార్పరేట్‌ లుక్‌తో హోటల్‌ గదులు

ఈ హోటల్‌లో ఏముంటాయ్‌?
విజయనగరం రైల్వే స్టేషన్‌లో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన హోటల్‌లో 30 గదులుంటాయి. ఒక్కో బెడ్‌పై ఇద్దరు చొప్పున ఏకకాలంలో 60 మంది వరకు రన్నింగ్‌ స్టాఫ్‌ విశ్రమించే వీలుంటుంది. ఈ హోటల్‌ గదులకు ఏసీ సదుపాయం కూడా ఉంది. అంతేకాదు.. వినోదం కోసం టీవీలు, క్యారమ్స్‌ వంటి ఆటలు ఆడుకునే సదుపాయం, న్యూస్‌ పేపర్లు, మ్యాగజైన్లు వంటివి చదువుకోవడానికి రీడింగ్‌ రూమ్‌ తదితర సౌకర్యాలను కల్పించారు. ఈ హోటల్‌ నిర్వహణను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారు. అందువల్ల ఈ హోటల్‌లో విశ్రాంతి తీసుకునే లోకో పైలట్లు, గార్డులు తమకు నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్‌ ఇచ్చుకుని తినొచ్చు. అందుకయ్యే ఖర్చును రైల్వే శాఖే భరిస్తుంది.

విజయనగరం స్టేషన్లో రైల్వే రన్నింగ్‌ స్టాఫ్‌ కోసం సమకూర్చిన బెడ్లు

త్వరలో మరికొన్ని స్టేషన్లలో..
తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో విజయనగరం రైల్వే స్టేషన్‌.. భువనేశ్వర్, రాయపూర్, దువ్వాడ వైపుల నుంచి వచ్చే రైళ్లకు జంక్షన్‌గా ఉంది. ఈ స్టేషన్‌ మీదుగా ఆయా రాష్ట్రాలకు రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. అందువల్ల రన్నింగ్‌ స్టాఫ్‌ కోసం ప్రత్యేక హోటల్‌ (లాడ్జింగ్‌ కం బోర్డింగ్‌)ను విజయనగరంలో ఏర్పాటు చేయాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని తర్వాత త్వరలో విశాఖపట్నం, రాయపూర్, కోరాపుట్‌ స్టేషన్లలో కూడా ఈ తరహా హోటళ్లను ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నంలో 50, రాయపూర్‌లో 30 పడకలు చొప్పున సమకూర్చనున్నారు. ఇందుకోసం రైల్వే అధికారులు త్వరలోనే టెండర్లు పిలవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో ఆరేడు నెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకు రావాలని యోచిస్తున్నారు.
Read More
Next Story