
రైల్వే రన్నింగ్ స్టాఫ్కి కార్పొరేట్ తరహా హోటల్!
లోకోౖ పెలట్లు, గార్డులకు ఉచితం భోజనం వసతి సదుపాయం. తొలిసారిగా విజయనగరం స్టేషన్లో ఏర్పాటు.
రైళ్లలో విధులు నిర్వహించే లోకో పైలట్లు, గార్డుల కోసం ఓ మంచి ఆలోచన చేసింది తూర్పు కోస్తా రైల్వే. విధి నిర్వహణలో అలసి సొలసిన వీరికి విశ్రాంతి సమయంలో హాయి గొలిపే వసతితో పాటు రుచికరమైన భోజనం, రీడింగ్ రూమ్ సదుపాయాన్ని కల్పించింది. తూర్పు కోస్తా (ఈస్ట్ కోస్ట్) రెల్వే జోన్ పరిధిలో తొలిసారిగా విజయనగరం రైల్వే స్టేషన్లో హోటల్ (లాడ్జింగ్, బోర్డింగ్)ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. వివిధ ప్రయాణికుల రైళ్లు, గూడ్సు రైళ్లలో లోకో పైలట్లు, గార్డులు (వీరిని రన్నింగ్ స్టాఫ్గా వ్యవహరిస్తారు) విధులు నిర్వహిస్తుంటారు. అనంతరం డ్యూటీ దిగాక సమీపంలోని రైల్వే స్టేషన్లలో ఉన్న గదుల్లో విశ్రాంతి తీసుకుంటారు. ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకున్నాక మళ్లీ విధులకు హాజరవుతారు. ఆ ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకోవడానికి ఆయా స్టేషన్లలో తక్కువ విస్తీర్ణం, తక్కువ సంఖ్యలో, అరకొర సదుపాయాలతో ఇరుకుగా ఉన్న విశ్రాంతి గదుల్లో సేద తీరుతారు. వీరికి రైల్వే సిబ్బంది భోజనం వండి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఉత్తర రైల్వే జోన్ పరిధిలో మొట్టమొదటి సారిగా ఈ రన్నింగ్ స్టాఫ్ కోసం కార్పరేట్ తరహా లాడ్జింగ్ కమ్ బోర్డింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో విజయనగరం రైల్వే స్టేషన్లో ఇలాంటి హోటల్ను అందుబాటులోకి తెచ్చారు. దీనిని సోమవారం వాల్తేరు డివిజనల్ మేనేజర్ లలిత్ బోహ్రా ప్రారంభించారు. ఈ తరహా హోటళ్లలో ఆధునిక సదుపాయాలు, సౌకర్యవంతమైన వసతి రన్నింగ్ స్టాఫ్ మనోస్థైర్యాన్ని పెంచడంతో పాటు సంక్షేమం, వారిలో నిబద్ధత, పనితీరును మరింత మెరుగు పరుస్తుందని పేర్కొన్నారు. వీటి నిర్వహణ ఔట్సోర్సింగ్కు ఇవ్వడం వల్ల సేవా నాణ్యత, పరిశుభ్రత పెంపొందుతుందని చెప్పారు.
కార్పరేట్ లుక్తో హోటల్ గదులు
విజయనగరం స్టేషన్లో రైల్వే రన్నింగ్ స్టాఫ్ కోసం సమకూర్చిన బెడ్లు