
మోదీ సభకు 8వేల బస్సులతో జన సమీకరణ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే2న శుక్రవారం అమరావతి పర్యటనకు రానున్నారు.
అమరావతి నిర్మాణాలను పునఃప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే2న అమరావతి పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రధాని మోదీ టూర్లో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భారీ బహిరంగ సభతో పాటుగా రోడ్షో నిర్వహించనున్నారు. వీటికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టనున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి ఐదు లక్షల మంది ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రజలను తరలించేందుకు దాదాపు 8 వేల బస్సులను రంగంలోకి దింపనున్నారు.
రాజధాని అమరావతి చుట్టుపక్కల ఉన్న ఎనిమిది జిల్లాల నుంచే అధిక సంఖ్యలో ప్రజలను తరలించనున్నారు. ఈ ఎనిమిది జిల్లాల నుంచి ప్రజలను ప్రధాని మోదీ సభకు తీసుకొచ్చేందుకు 6,600 బస్సులను రంగంలోకి దింపారు. తక్కిన 120 నియోజక వర్గాల నుంచి 1400 బస్సుల ద్వారా ప్రజలను తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. గురువారం రాత్రికే నిర్థేశించిన ఆయా ప్రాంతాలకు బస్సులు చేరుకోనున్నాయి.
ప్రజలను తరలించేందుకు ఉపయోగించే బస్సులన్నింటిల్లోను ప్రభుత్వ ఉద్యోగులను ఇన్చార్జిలుగా నియమించనున్నారు. ఒక్కో బస్సుకు ఒక్కో ప్రభుత్వ ఉద్యోగిని ఇన్చార్జిగా కూటమి ప్రభుత్వం నియమించింది. ప్రధాని మోదీ సభకు, రోడ్ షోలకు ఆయా ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొని రావడంతో పాటుగా వారిని ఆయా ప్రాంతాలకు క్షేమంగా తరలించే బాధ్యతలను కూడా ఇన్ చార్జిలుగా ఉన్న ఆ ప్రభుత్వ ఉద్యోగులకు అప్పగించింది. ప్రజలను తరలించే బస్సులకు మండలాల వారీగా ఇన్చార్జిలను కూడా నియమించారు. ప్రతి మండలానికి ఒక ఇన్ చొప్పున ఏర్పాటు చేశారు. వీరి ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి చేరుకునే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
సభకు తరలి వచ్చే ప్రజలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రి భోజనం సదుపాయాన్ని కూడా కూటమి ప్రభుత్వం కల్పించనుంది. అంతేకాకుండా వేసవిని దృష్టిలో ఉంచుకుని సభకు తరలి వచ్చే ప్రజలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచి నీళ్లు, పండ్లు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు. జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారుల ఈ బాధ్యతలను అప్పగించారు. వీరు ప్రజలకు ఆహార పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా సభ ప్రాంగణంలోను, సభా గ్యాలరీల్లోను ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆరుగురు సిబ్బందితో కూడిన వైద్య బృందాలు వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాటు చేశారు.
సభ ఏర్పాట్లు, ప్రధాని మోదీ ఎప్పుడు వస్తారనే దానిపై మంత్రి నారాయణ స్పందిస్తూ.. మే 2న శుక్రవారం మధ్యాహ్నం 3:20 గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి చేరుకుంటారని తెలిపారు. సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని చెప్పారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలను సభకు రావాలని సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారని, రైతుల త్యాగాలు మరువలేనివని మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రధాని మోదీ ప్రసంగించే సభా ప్రాంగణం సిద్ధం అయిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
Next Story