
గోదావరిలో 8 మంది గల్లంతు
శుభకార్యానికి వెళ్లిన యువకులు సరదా స్నాన్నం కోసం దిగి నీటి ఉధృతికి కొట్టుకొని పోయారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదా స్నాన్నం కొంపముంచింది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని లంక సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సరదాగా స్నానం చేద్దామని గోదావరిలోకి దిగిన యువకులు గల్లంతయ్యారు. కాకినాడ, రామచంద్రాపురం, మండపేల ప్రాంతాల నుంచి కొన్ని కుటుంబాలు కే గంగవరం మండలం శేరులంక గ్రామంలో ఒక శుభకార్యానికి హాజరయ్యారు. వీరిలో 11 మంది యువకులు సరదాగా స్నానం చేద్దామని సమీపంలో ఉన్న గోదావరి నదిలోకి వెళ్లారు. వీరు స్నానం చేస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఎక్కువుగా ఉంది. స్నానానికి దిగిన 11 మంది యువకుల్లో ముగ్గురు యువకులు సురక్షితంగా బయటకు వచ్చారు. తక్కిన 8 మంది యువకులు నీటి ఉధృతికి గల్లంతయ్యారు. కాకినాడకు చెందిన 20 ఏళ్ల క్రాంతి, 18 ఏళ్ల పాల్, 18 ఏళ్ల సాయి, 19 ఏళ్ల సతీష్లతో పాటు ఐ.పోలవరం మండలం ఎర్రగరువు గ్రామానికి చెందిన మహేష్, రాజేష్, మండపేటకు చెందిన రోహిత్, శేరులంకకు చెందిన మహేష్లు గోదావరి నీటి ఉధృతికి కొట్టుకొనిపోయి గల్లంతయ్యారు. దీంతో శుభకార్యానికి వచ్చిన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గల్లంతైన యువకుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు,