ఆంధ్రప్రదేశ్లో వ్యర్ధాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా విధంగా రెండు మాసాల్లో ‘సర్క్యులర్ ఎకానమీ’ తుది పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తొలుత రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఈ సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో పాటుగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాలను వినియోగాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ చెత్తను వేరు చేయడంపైన, రీసైక్లింగ్పైన 90 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వ్యర్ధాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’ ఏర్పాటుపై ‘మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ప్రతిపాదనలను సీఎం పరిశీలించారు. విశాఖపట్నంలో 400 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ‘సర్క్యులర్ ఎకానమీ పార్కు’ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని, దీని కోసం వివిధ దేశాల్లోని పార్కులను పరిశీలించాలని సూచించారు. ఈ అంశంలో భారీగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని చెప్పారు.
సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మున్సిపల్, వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం, టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్ధాలు వంటి 11 రంగాలపై దృష్టి పెట్టడంతో పాటు అదనంగా గనులు, చేనేత, పశుసంవర్ధక శాఖల సమన్వయంతో కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. నగర పాలక సంస్థలు, పంచాయతీల్లో జీరో వేస్ట్ లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. వ్యర్ధాల నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వాళ్లకు ప్రోత్సాహకంగా ‘స్వచ్ఛత’ అవార్డులను వచ్చేఏడాది అక్టోబర్ 2 నుంచి ఇవ్వాలని సూచించారు. స్థానిక సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీలు, పాఠశాలలు–కళాశాలలు, బస్టాండ్లు, ఆస్పత్రులు, ఎన్జీవోలు, వివిధ ఆర్గనైజేషన్ల వారీగా అవార్డులు ఇవ్వాలన్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 2 కల్లా రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండితో కలిపి 4 నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నగరాల్లో క్లాత్ బ్యాగులు వినియోగాన్ని పెంచాలన్నారు. అలాగే 87 పట్ణణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్–రీయూజ్డ్–రీసైకిల్ సెంట్లర్లను ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాకు రెండు చొప్పున మొత్తం 52 వేస్ట్ క్లస్టర్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రం నుంచి ప్రతీ ఏటా బ్యాటరీలు, ఇతర ఆటోమోటివ్ వ్యర్ధాలు 36,588 టన్నులు, ప్లాస్టిక్ – పెట్ బాటిల్స్ వేస్ట్ 61,996 టన్నులు, ఇంజిన్ ఆయిల్స్ ఇతర హైడ్రాలిక్ చమురు వ్యర్ధాలు 23,928 లీటర్లు, టైర్లు–రబ్బర్ 59,654 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అత్యధికంగా వ్యవసాయరంగం నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు, పశువులు–ఆక్వా–పౌల్ట్రీ ఈ మూడు రంగాల నుంచి 347 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు వస్తున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ రోజూ 88 లక్షల గృహాల నుంచి 1,329 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు వస్తున్నాయని తెలిపారు. రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్రలో సర్క్యులర్ ఎకానమీ కోసం అందిస్తున్న ప్రోత్సాహకాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.