
ప్రతి ఒక్కరికి 2.5లక్షల బీమా
కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
యూనివర్సల్ హెల్త్ కార్డు ద్వారా రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ రూ.2.5 లక్షల బీమా అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలో స్వస్థ్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు బుధవారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద వాళ్లందరికీ ఎన్డీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స లభిస్తుందన్నారు. రాష్ట్రీయ పోషణా మాసం థీమ్స్లో భాగంగా ఊబకాయం నియంత్రణ, బ్రెస్ట్ ఫీడింగ్ లాంటి కార్యక్రమాలు, అంగన్వాడీల్లో పిల్లలకు అందుతున్న పోషణపై తల్లితో పాటు తండ్రులనూ ఆహ్వానించి సమాచారం ఇస్తున్నామన్నారు.
సంజీవని ద్వారా టెక్నాలజీ వినియోగించి వైద్య సేవలు అందించేలా పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయ్యిందన్నారు. ఐదుకోట్ల మంది ఆరోగ్య రికార్డులు తయారు చేస్తున్నామన్నారు. ప్రివెంటివ్ క్యూరెటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ విధానంలో వైద్య చికిత్సలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విశాఖలో మెడ్ టెక్ పార్కులో వైద్య పరికరాలు రూపొందించి ప్రపంచానికి ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నామన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కు జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు..తద్వారా ఆమేరకు భారం తగ్గిందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం ద్వారా రూ.15 వేలు ఇచ్చి ప్రోత్సహించాం, దీపం2 ద్వారా మహిళలకు 3 సిలెండర్లు ఇచ్చామన్నారు. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేలా స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్నామన్నారు.