25 కోట్ల మంది ఇప్పటి వరకు దేశంలో దారిద్య్ర రేఖ నుంచి బయటకు వచ్చారని, మధ్యతరగతి ఆస్పిరేషన్స్ కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమరావతిలో బ్యాంకుల ప్రధాన కార్యాలయాల భవనాల శంకుస్థాపన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రీస్టార్ట్ చేయటం సంతోషం. దేశంలో ఒక కొత్త రాజధాని నగరం నిర్మించటం సామాన్యమైన విషయం కాదు. నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ కూడా సహకరిస్తున్నారు. అమరావతి నిర్మాణం అంటే ఒక యజ్ఞం లాంటింది. ఇంత పెద్ద నగరానికి ఆర్ధికంగా భరోసా ఉండాలన్న నిర్ణయంతోనే ఇవాళ పీఎస్యూ సంస్థలు ప్రధాన కార్యాలయాలు వస్తున్నాయి. 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒకే చోట బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండటం అభినందనీయం. రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. బ్యాంకులన్నీ రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవటం బాధ్యత. బ్యాంకులు కేవలం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు ఇవ్వడానికే పరిమితం కావొద్దు. దానిని మించి ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలి అని అన్నారు.
రైతులు దేశానికి పౌష్టికాహారం అందిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి అరటి, తమిళనాడు నుంచి కొబ్బరి ఢిల్లీ , ముంబై లాంటి ప్రాంతాలకు రైళ్లలో తరలుతున్నాయి. అలాగే ఇతర పంటలకూ ఈ తరహా మార్కెటింగ్ సౌలభ్యాలు ఉంటే వారికి ఆర్ధిక ప్రయోజనాలు అందుతాయి. ఏపీలోని రాయలసీమలో ఉన్న 9 జిల్లాల నుంచి ఉద్యాన ఉత్పత్తులు ఇతర రాష్ట్రాల మార్కెట్ లకు తరలించడానికి బ్యాంకులు సహకరించాలి. కేవలం కిసాన్ క్రెడిట్ కార్డుల రుణం ద్వారా ఇది సరిపోదు. ప్యాకింగ్, కోల్డ్ చెయిన్ లాంటి పరిశ్రమల్ని కూడా ప్రోత్సహించాలని గుర్తుంచుకోండి. భవిష్యత్ ఆలోచనలు, సమీకృత ఐడియాలను బ్యాంకులు కలిగి ఉండాలి. గతంలో మహిళల్ని బీమా ఏజెంటుగా మార్చేందుకు మహిళా సఖి పేరిట కార్యక్రమం ప్రారంభిస్తే అద్భుత ప్రయోజనాలు వచ్చాయి. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినా ప్రధాని మోదీ తక్షణం అమోదిస్తారు. విభజన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్కు పూర్తిగా సహకరించాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. క్వాంటం వ్యాలీ, ఏఐ ప్రాజెక్టుల కోసం జిల్లాల్లో ఏఐ శిక్షణ పొందేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. కేవలం ఐటీ గురించే కాదు ఆస్ట్రో ఫిజిక్స్ గురించి కూడా కేంద్రం ఆలోచిస్తోంది. ఏపీ ప్రభుత్వంతో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ సంస్థ ఇవాళ ఒప్పందం చేసుకోవటం సంతోషకరం. ఏడాదిన్నరలో ఏపీ ఫ్యూచరిస్టిక్ కేపిటల్ నగరం అవుతుంది. అమరాతిలో కాస్మోస్ ప్లానెటోరియం నిర్మించాలని కోరుతున్నా. ఆచార్య నాగార్జునుడు లాంటి శాస్త్రీయ పరిశోధకులు నివసించిన ప్రాంతం ఏపీ. రేర్ ఎర్త్ మినరల్స్ పై కూడా కేంద్రం ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రంగంలో కూడా ఏపీ పనిచేయాలని కోరుతున్నాను అని నిర్మలా సీతారామన్ అన్నారు.