చంద్రబాబుపై 24 కేసులున్నాయి..రోడ్డుపైకి తీసుకొచ్చి తన్నుతారా?
x

చంద్రబాబుపై 24 కేసులున్నాయి..రోడ్డుపైకి తీసుకొచ్చి తన్నుతారా?

కేసులను తేల్చాల్సింది కోర్టులని, పోలీసులు కాదని తెనాలి ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మీద 24 కేసులు ఉన్నాయి.. అలా కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబును రోడ్డుపైకి తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా? అలా చేయడం ధర్మం అవుతుందా? అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. మరి తెనాలి ఘటనలో పోలీసులు ఎందుకు అంత దారుణంగా వ్యవహరించారని నిలదీశారు. తెనాలి ఘటనలో బాధిత కుటుంబాలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పాలన, రెడ్‌బుక్‌ రాజ్యాంగంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

తెనాలి ఘటన బాధితులు రాకేష్, విక్టర్, కరీముల్లాతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నత చదువులు చదువుకున్న వారే అని, పోలీసులు వారి కుటుంబాల పరువును అన్యాయంగా బజారుకీడ్చారని ధ్వజమెత్తారు. కేసులు ఉంటే కోర్టులు చూసుకుంటాయని, విచారణలు జరిపి శిక్షలు వేస్తాయని, అలాంటిది పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగానే అత్యంత దారుణంగా కొట్టి, అంతటితో వదలకుండా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ అన్యాయంగా పోలీసులు కొట్టారని, ఇదెక్కడ న్యాయమని జగన్‌ నిలదీశారు. వారిపైన కేసులుంటే వాటిని తాను సమర్థించడం లేదని, వాటిని కోర్టులు చూసుకుంటాయని, పోలీసులు ఇలా దారుణంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు పాశవికంగా కొట్టిన వీడియోలు వైరల్‌ కావడంతో.. వాటి నుంచి తప్పించుకునేందుకు బాధితుల మీద పలు కేసులు నమోదు చేసి, అన్యాయంగా రౌడీషీట్లు ఓపెన్‌ చేశారని మండిపడ్డారు.

సివిల్‌ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్‌ను ప్రశ్నించడం వీరు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఏప్రిల్‌ 24న కానిస్టేబుల్‌ను యువకులు ప్రశ్నిస్తే.. 25న పోలీసులు మంగళగిరి వెళ్లి జాన్‌ విక్టర్‌ను, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారని, తర్వాత తెనాలి పోలీసు స్టేషన్‌లో కూడా పడేసి మరీ కొట్టారని, ఏప్రిల్‌ 26న తెనాలి ఐతానగర్‌ నడిరోడ్డు మీద పడేసి ముగ్గురి చితకబాదారని, ఇదెక్కడ న్యాయమని జగన్‌ ప్రశ్నించారు. 24 గంటల్లో కోర్టులో ఎందుకు హాజరు పరచలేదని నిలదీశారు. కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారని, ఆసుపత్రిలో వైద్యులు బాధితులకు ఉన్న గాయాలను ఎందుకు గుర్తించలేదని నిలదీశారు. కేవలం ఇది మెడికో లీగల్‌ కేసు కాకుండా చూసుకునేందుకే ఇలా చేశారని అన్నారు.
ఏప్రిల్‌ 26న బాధితులను నడిరోడ్డుపై కొట్టిన వీడియో నెల రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఈ వీడియోను రికార్డు చేసింది కూడా పోలీసులే. కొంత మంది మంచి పోలీసులు ఈ వీడియోను బయటకు తెచ్చారు. చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే. బాధితుల కుటుంబాలను అబాసుపాలు చేస్తూ.. గంజాయి బ్యాచ్‌గాను, రౌడీషీటర్లుగాను ముద్రలు వేస్తున్నారు. బాధితుల మీద ఏదైనా పాత కేసులు ఉంటే.. వాటికి ఈ ఘటనకు సంబంధం ఏంటి అని జగన్‌ ప్రశ్నించారు. వ్యక్తిత్వ హనానికి పోలీసులు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన నేర నేపథ్యం వీరికి ఉంటే.. పోలీసులు చెబుతున్నది నిజమే అయితే మంగళగిరి వారిని తెనాలికి తీసుకొచ్చి కొట్టారంటే పోలీసులు చెబుతున్నవి అబద్దాలే అని అర్థమతుందన్నారు. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అన్యాయాలు ఇలానే కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌కు, ప్రజలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. వీరి మోసాలపై, పరిపాలన మీద, అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేయడంపై నిరసనగా జూన్‌ 4న వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని, ప్రజలంతా దీనిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Read More
Next Story