
చంద్రబాబుపై 24 కేసులున్నాయి..రోడ్డుపైకి తీసుకొచ్చి తన్నుతారా?
కేసులను తేల్చాల్సింది కోర్టులని, పోలీసులు కాదని తెనాలి ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మీద 24 కేసులు ఉన్నాయి.. అలా కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబును రోడ్డుపైకి తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా? అలా చేయడం ధర్మం అవుతుందా? అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. మరి తెనాలి ఘటనలో పోలీసులు ఎందుకు అంత దారుణంగా వ్యవహరించారని నిలదీశారు. తెనాలి ఘటనలో బాధిత కుటుంబాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పాలన, రెడ్బుక్ రాజ్యాంగంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెనాలి ఘటన బాధితులు రాకేష్, విక్టర్, కరీముల్లాతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నత చదువులు చదువుకున్న వారే అని, పోలీసులు వారి కుటుంబాల పరువును అన్యాయంగా బజారుకీడ్చారని ధ్వజమెత్తారు. కేసులు ఉంటే కోర్టులు చూసుకుంటాయని, విచారణలు జరిపి శిక్షలు వేస్తాయని, అలాంటిది పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగానే అత్యంత దారుణంగా కొట్టి, అంతటితో వదలకుండా పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి అక్కడ అన్యాయంగా పోలీసులు కొట్టారని, ఇదెక్కడ న్యాయమని జగన్ నిలదీశారు. వారిపైన కేసులుంటే వాటిని తాను సమర్థించడం లేదని, వాటిని కోర్టులు చూసుకుంటాయని, పోలీసులు ఇలా దారుణంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు పాశవికంగా కొట్టిన వీడియోలు వైరల్ కావడంతో.. వాటి నుంచి తప్పించుకునేందుకు బాధితుల మీద పలు కేసులు నమోదు చేసి, అన్యాయంగా రౌడీషీట్లు ఓపెన్ చేశారని మండిపడ్డారు.