
ఏపీలో అక్రమ గ్రానైట్..14లారీలు సీజ్
సేల్ ట్యాక్ అధికారులు, లారీ డ్రైవర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున అక్రమ గ్రానైట్ తరలింపులు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఈ అక్రమ గ్రానైట్ తరలింపులకు వేదికగా మారింది. దీనిని అడ్డుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. తరలింపులకు పాల్పడుతున్న వాహనాలను నిగ్గు తేల్చాలని భావించారు. ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామం వద్ద సేల్ ట్యాక్స్ అధికారుల టీమ్లు రంగంలోకి దిగాయి. వాహనాలను తనిఖీలు చేసేందుకు ఉపక్రమించారు. కొన్ని లారీలు అక్రమంగా గ్రానైట్ను తరలిస్తున్నట్లు గుర్తించారు.
వీటిని అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే లారీడ్రైవర్లు మాత్రం అధికారుల అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అటు అధికారులు, ఇటు లారీ డ్రైవర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అధికారులు పల్నాడు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి విషయాన్ని చేరవేశారు. స్పందించిన పల్నాడు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటు అధికారులు, ఇటు పోలీసులు కలిసి అక్రమ గ్రానైట్ తరలింపులకు పాల్పడుతున్న 14 లారీలను సీజ్ చేయగా, మరో 3 లారీలు తప్పించుకొని తెలంగాణ వైపు వెళ్లిపోయాయి. సీజ్ చేసిన లారీలను దాచేపల్లి మార్కెట్ యార్డుకు తరలించారు.