చంద్రబాబు 2019లో ఓడిపోవటానికి కారణం తెలుసా?
x

చంద్రబాబు 2019లో ఓడిపోవటానికి కారణం తెలుసా?

కూటమి అఖండ విజయానికి ప్రధాన కారణం నెగెటివ్ ఓటు అనటంలో సందేహం లేదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవటానికి దారితీసిన పరిస్థితులేమిటో ఒకసారి గుర్తు చేసుకుందాం.


ఎన్నికల్లో గెలుపు, ఓటములు ఒక్కోసారి పాజిటివ్ ఓటు ఆధారంగా, ఓక్కోసారి నెగెటివ్ ఓటు ఆధారంగా సంభవిస్తాయి. మొన్న ఎన్నికల్లో కూటమి అఖండ విజయానికి ప్రధాన కారణం నెగెటివ్ ఓటు అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. వైసీపీ ప్రభుత్వ చర్యలతో, పాలనతో విసిగిపోయిన వివిధ వర్గాలు ఒక కసితో ఓటువేసి జగన్‌ను గద్దె దించారని చిన్న పిల్లాడికైనా అర్థమవుతుంది(వైసీపీ వర్గాలు ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేతున్నాయనుకోండి). 2019లో తెలుగుదేశానికి పట్టిన గతే(అంతకంటే ఘోరంగా అనికూడా చెప్పుకోవచ్చు) ఇప్పుడు వైసీపీకి పట్టింది. మరి నాడు 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయానికి దారితీసిన పరిస్థితులేమిటో ఒకసారి గుర్తు చేసుకుందాం.

2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలి ఎన్నికల్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమే విజయం సాధించింది. నాడు కూటమి 106 సీట్లు, వైసీపీకి 67 సీట్లు గెలుచుకున్నాయి. వైసీపీకి అప్పటికే బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ, కొత్త రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్‌‌ను నడపగల సామర్థ్యం, కొత్త రాజధానిని నిర్మించగల దక్షత జగన్ కంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబుకే ఉంటుందని జనం భావించటం, పవన్ కళ్యాణ్ మద్దతుతో కాపు ఓట్, యువత ఓట్ ట్రాన్సఫర్ కావటం, మోది కరిష్మా… అన్నీ కలిసివచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంటికి పెద్దకొడుకుగా ఉంటాను, అహోరాత్రాలూ కష్టించి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానంటూ బాబు చెప్పిన సెంటిమెంట్ డైలాగులను జనం విశ్వసించారు. అయితే ఐదేళ్ళు తిరిగేటప్పటికి సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. ఆయన పార్టీకి కేవలం 23 సీట్లు దక్కాయి. నాటి ఎన్నికల్లో టీడీపీపై నెగెటివ్ ఓటుతో పాటు, కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్లుగా నడిచేస్తూ ఒక్క ఛాన్స్ అని ప్రాథేయపడిన జగన్‌ను కూడా ఒకసారి చూద్దామన్న పాజిటివ్ ఓటు కలిసి వైసీపీకి ఘనవిజయానికి కారణమయ్యాయి. నాడు టీడీపీ ప్రభుత్వంపై నెగెటివ్ ఓటుకు పది ప్రధాన కారణాలను చెప్పుకోవచ్చు.

అమరావతి

రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు మొదటే తప్పటడుగు వేశారు. ఏపీ పరిస్థితి - కట్టుబట్టలతో తరిమేస్తే, చెట్టుకింద నిలబడేలాగా ఉందని ఒకవైపు సినిమా డైలాగులు చెబుతూనే, తాహతుకు మించి అంతర్జాతీయస్థాయి రాజధాని నగర నిర్మాణానికి పూనుకోవటం ఏమాత్రం పొంతన లేకుండా ఉండింది.

అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళనుంచి కూడా, రాజధాని నిర్మాణంపై టీడీపీ ప్రభుత్వం విపరీతమైన హైప్ సృష్టించింది. లండన్, ప్యారిస్ లెవెల్‌లో అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మిస్తామంటూ ఊదరగొట్టారు. కానీ ఐదేళ్ళ తర్వాత చూసుకుంటే అమరావతి - 'ఆలూ లేదు, చూలూ లేదు...' అన్న చందంగా ఉంది. అన్నీ తాత్కాలిక నిర్మాణాలు, వాటికి చదరపు అడుగుకు ఇచ్చిన రేటేమో సాధారణ స్థాయికి ఎన్నోరెట్లు ఎక్కువ. రాజధాని ఎంపికే నెలల తరబడి జరిగింది. బాబు నిరంతరం జపించే 'పారదర్శకత' రాజధాని ఎంపికలో ఏమాత్రం కనిపించలేదు.

ప్రకాశం జిల్లాలోని దొనకొండ, కృష్ణాజిల్లా ఆగిరిపల్లి వద్ద కొన్ని మంచి ప్రత్యామ్నాయాలే ఉన్నప్పటికీ, బంగారం పండుతుందని చెప్పుకునే జరీబు భూములున్న అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశారు. నీటి వనరులు పుష్కలంగా ఉంటాయని, నది ఒడ్డున ఉంటే బాగా అభివృద్ధి జరుగుతుందనే కారణాలను బయటకు చెప్పుకొచ్చినప్పటికీ, ఈ నిర్ణయం వెనుక అస్మదీయ వర్గంలోని కార్పొరేట్ శక్తులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తల స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దానికితోడు ఈ ఎంపిక నిర్ణయం ముందే తెలుసుకుని అస్మదీయ వర్గం అమరావతిని రాజధానిగా ప్రకటించేముందే ఆ ప్రాంతంలో వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇన్ సైడర్ ట్రేడింగ్ వంటి తీవ్రస్థాయి ఆర్థిక నేరానికి పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. ఇవి నిప్పునని చెప్పుకునే చంద్రబాబుకు కళంకాన్ని మిగిల్చాయి.

రాజధాని నిర్మాణంకోసం భారీ స్థాయిలో 35 వేల ఎకరాలను భూ సమీకరణ విధానంలో తీసుకున్నారు. పెద్ద ఎత్తున విద్యావ్యాపారంచేసే ఎస్ఆర్ఎమ్, వీఐటీ వంటి అనేక విద్యాసంస్థలకు వందల ఎకరాలను నామమాత్రపు ధరలకు(ఎకరం భూమి మార్కెట్ ధర రు.2.50 కోట్లు ఉండగా రు.50 లక్షల చొప్పున) కట్టబెట్టారు. వైఎస్ హయాంలో సెజ్ ల పేరుతో వందల ఎకరాలను ఆయన అస్మదీయులకు ఉదారంగా పంచారన్న విమర్శ బలంగా ప్రచారంలో ఉండగా, బాబు అదే తప్పును చేయటం గమనార్హం. అమరావతిలో ప్రైవేట్ విద్యా, వైద్య సంస్థలకు పెద్ద ఎత్తున ఉదారంగా భూములను కేటాయించటంలో కూడా క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఒక ఉదాహరణను తీసుకుంటే, ఇండో యూకే అనే వైద్య సంస్థకు న్యూ చండీగఢ్ లో హెల్త్ సిటీలో అక్కడి ప్రభుత్వం 20 ఎకరాలు కేటాయిస్తే, ఏపీ ప్రభుత్వం అదే సంస్థకు అమరావతిలో 150 ఎకరాలు కేటాయించింది.

ప్రత్యేకహోదా

ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయని, నీతి ఆయోగ్ వద్దని సూచించిందనే కారణాలతో కేంద్రం ఈ హామీపై మాట తప్పింది. అయితే దీనిపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము గానీ, కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు, ఎంపీలతో రాజీనామా చేయించే ధైర్యంగానీ చంద్రబాబుకు లేవు. కనీసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళే సాహసంకూడా చేయలేకపోయారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజికి తలూపారు. అంతే కాకుండా హోదాయే సంజీవని కాదు అని, హోదా విషయంలో తాను రాజీ పడ్డాను కాబట్టే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణబాధ్యతను తీసుకోటానికి కేంద్రం అంగీకరించిందని కూడా బహిరంగంగా. మళ్ళీ హోదాపై ఉద్యమం మొదలయ్యేటప్పటికి మాట మార్చారు. హోదా ఇవ్వాల్సిందేనని బాబు డిమాండ్ చేశారు. హోదా డిమాండ్ పతాకస్థాయికి చేరిన సమయంలోకూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇద్దరు కేంద్రమంత్రులతో, ఎంపీలతో రాజీనామా చేయించి ఉంటే, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ డిఫెన్స్ లో పడిపోయిన బీజేపీ తలొగ్గిఉండేది. కానీ బాబు అలా చేయలేదు.

గోదావరి పుష్కరాల దుర్ఘటన

గోదావరి పుష్కరాల మొదటి రోజున జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారణం పూర్తిగా అధికార యంత్రాంగం వైఫల్యమే అన్నది చంద్రబాబు కూడా అంగీకరించారు. వాస్తవానికి ఆరునెలల ముందునుంచి ఈ పుష్కరాలకోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి అనేకసార్లు రాజమండ్రి వెళ్ళి సమీక్షా సమావేశాలను నిర్వహించారు. అయితే చివరికి తేలిందేమిటంటే ఆ సమావేశాల్లో క్రౌడ్ మేనేజిమెంట్ అనే ముఖ్యమైన అంశం తప్ప మిగిలినవన్నీ చర్చించారట. 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా పుష్కరాలు అంటూ విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి దీనినొక పెద్ద ఈవెంట్ గా జరపాలని చూడటంతో జనం ఆకర్షితులై మొదటిరోజే పోటెత్తారు. ముఖ్యమంత్రి వీఐపీలకు ఉద్దేశించిన ఘాట్ లో కాకుండా పుష్కర్ ఘాట్ లో కుటుంబసమేతంగా స్నానం చేస్తుంటే మంత్రులు, అధికారులందరూ అక్కడే నిలబడి వేడుక చూస్తున్నారు… ఇక్కడేమో తొక్కిసలాట ప్రారంభమై 30 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎంతమంది జనం వస్తారనే అవగాహనగానీ, వచ్చిన భారీ జనాన్ని వేరే ఘాట్ లకు తరలించాలనే అలోచనగానీ లేకపోవటంతో ఘోరం జరిగిపోయింది.

ఓటుకు నోటు కేసు

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేము నరేందర్ రెడ్డి గెలుపుకోసం రేవంత్ రెడ్డి స్ఠీఫెన్సన్ అనే నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టటానికి వెళ్ళి అడ్డంగా బుక్ అయ్యాడు. ఇలాంటి ఎన్నికల్లో ప్రతి పార్టీ ఇలాంటి పనులు చేయటం సర్వసాధారణమే. అయితే ప్రత్యర్థిపార్టీ అధికారంలో ఉన్న చోట, అడ్డగోలుగా, అమాయకత్వంగా వెళ్ళి బేరసారాలు చేయటం, అందునా ఇంత సీనియారిటీ, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్వయంగా దీనిలో కల్పించుకోవటాన్ని అజ్ఞానమని అనాలో, మూర్ఖత్వం అనాలో తెలియని పరిస్థితి. అయితే గుడ్డిలో మెల్లగా - తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయించటం తీవ్రనేరం కిందకు వస్తుందని తేలటం ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకు ఊరటనిచ్చిన విషయం. ఇరువర్గాలకూ అనుకూలుడైన ఒక పెద్దమనిషి దౌత్యంతో ఈ గొడవ మొత్తానికి చల్లబడింది. ఏది ఏమైనా ఏపీ ముఖ్యమంత్రి ఇలా అడ్డంగా బుక్ అవ్వటం రాష్ట్రప్రజలకే తలవంపులు తెచ్చిందనటంలో ఏమాత్రం సందేహంలేదు.

తుని ఘటన

కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికలముందు పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం మొదలుపెట్టిన ఉద్యమం తునిలో తలపెట్టిన మహాసభతో పతాకస్థాయికి చేరింది. రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం దాదాపు పూర్తిగా ముద్రగడకు మద్దతుగా నిలబడింది. అటువంటి పరిస్థితిలో తుని మహాసభకు పెద్ద ఎత్తున జనం వస్తారని ఎవరైనా తేలిగ్గా ఊహించొచ్చు… అక్కడ సంఘవ్యతిరేక శక్తులు దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేయొచ్చు. ప్రభుత్వం అలా అంచనా వేయకపోవటంతో అక్కడ బలగాలను తగిన సంఖ్యలో మోహరించలేదు. ఫలితంగా రైలు దహనం ఘటన… అల్లకల్లోలం చోటుచేసుకుంది. దీనిలో ఇంటలిజెన్స్ వైఫల్యం కూడా ఉంది. మరోవైపు ఈ ఘటనపై స్పందిస్తూ, ఇది స్థానికుల పనికాదని, గోదావరి జిల్లాలవారు ఇలాంటి పనులు చేయరని వ్యాఖ్యానించిన చంద్రబాబు, తదనంతర కాలంలో మాత్రం ఆ ఘటనకు సంబంధించి స్థానిక కాపునేతలపై కేసులు బుక్ చేయించారు.

కాపు ఓట్ బ్యాంకును కాలదన్నుకోవటం

2014 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావటానికి ప్రధాన కారణాలలో కాపు సామాజికవర్గ ఓటు ఒకటి అన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి ఓట్ బ్యాంకును చంద్రబాబు స్వయంగా కాలదన్నుకున్నారు. కాపు సామాజికవర్గంలో అప్పట్లో ముద్రగడకు ఒక ప్రత్యేకస్థానం ఉండేది…. నిష్కళంకమైన ఆయన ట్రాక్ రికార్డ్ వలన. ఆయన ఆందోళనకు దిగాడని, దానిని చిలవలు పలవలుగా ఊహించుకుని, అదేదే ఖలిస్తాన్ ఉద్యమమో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమమో అన్నంతగా భయపడి ముద్రగడను, ఆయన కుటుంబసభ్యులను నిర్బంధించి ప్రభుత్వం అనేకరకాలుగా వేధించింది. కిర్లంపూడిలో భారీ ఎత్తున బలగాలను మోహరించి మీడియాలో ముద్రగడ వార్తలు రాకుండా ఆంక్షలు విధించింది. తమ కులంలోని ముద్రగడలాంటి సాధుజీవిని అలా అవమానించటంతో ఆ సామాజికవర్గంలో టీడీపీపై సహజంగానే ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి. టీడీపీ మాట ఎత్తితేనే కాపులు కస్సుమన్నారు. 2019 ఎన్నికల్లో కాపు ఓటు అత్యధికంగా వైసీపీకే పడింది.

పార్టీ ఫిరాయింపులు

వైసీపీనుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగాయి. వీటిలో కొన్ని జగన్ వ్యవహారశైలి నచ్చక స్వచ్ఛందంగా జరిగినవికాగా, అధికభాగంమాత్రం అధికారపార్టీ ప్రలోభాలకు లొంగి జరిగినవి. తెలుగుదేశానికి శాసనసభలో పూర్తి మెజారిటీ ఉండగా ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం వాస్తవానికి లేదు… అది కూడా పొరుగున ఉన్న తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ అక్రమంగా లాక్కుంటోంది అని యాగీ చేసిన నేపథ్యంలో. జగన్ ను దెబ్బకొట్టాలనో, ఏమో నైతిక విలువలకు, సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను తీసుకున్నారు. కొందరికి మంత్రిపదవులు కూడా కట్టబెట్టారు. ఇలా తీసుకున్న ప్రజా ప్రతినిధుల నియోజకవర్గాల్లో రెండు పవర్ సెంటర్స్ ఏర్పడటంతో నంద్యాలలో, జమ్మలమడుగు వంటి పలుచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దాని ప్రభావంకూడా టీడీపీ ఓటమికి కారణమయింది.

పరిపాలన

చంద్రబాబు 2004లో ఓడిపోవటానికి ప్రధానకారణాలలో ప్రభుత్వోద్యోగులను వెంటబడి వేధించటంకూడా ఒక కారణమన్నది తెలిసిందే. 2014లో గద్దెనెక్కిన తొలినాళ్ళలోనే ఉద్యోగసంఘాల సమావేశాల్లో మాట్లాడుతూ, ఉద్యోగుల జోలికి తాను రానన్నట్లుగా బాబు సంకేతాలిచ్చారు. ఉద్యోగసంఘాలనేతలు ఏది చెబితే దానికి తలాడించారు. దానికి తోడు, ఉద్యోగసంఘాలనేతలకు భావి ముఖ్యమంత్రిగా ఎదగాలనుకుంటున్న చినబాబు అండ లభించిందనికూడా అన్నారు. దీని ప్రభావంతో పరిపాలనపై పట్టు పోయింది. క్షేత్రస్థాయిలో అవినీతి తీవ్రంగా పెరిగిపోయింది. ఎక్కడా పైసా లేనిదే పని జరగలేదు.

వీటన్నంటికంటే ముఖ్యంగా - ఓటుకు నోటు కేసు ఎఫెక్టుతో, సొంతగడ్డపైనుంచే పరిపాలన చేసుకుంటానంటూ బాబు హైదరాబాద్ వదిలి వచ్చేశారు… పదేళ్ళ కాలవ్యవధి ఉన్నాగానీ. దిల్ కుష్ గెస్ట్ హౌస్ కు, హైదరాబాద్ సెక్రటేరియట్ లో ఏపీ విభాగానికి కోట్ల రూపాయలతో చేసిన అలంకారాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. వెలగపూడిలో తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీని మరికొన్ని కోట్లతో నిర్మించారు… రెండేళ్ళ తర్వాత. ఆ పనేదో ముందే చేస్తే బాగుండేది కదా అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు విభజన చట్టం ప్రకారం 9, 10 షెడ్యూల్ లోని 75 వేల కోట్ల విలువైన ఆస్తులను ఇరు రాష్ట్రాలకూ పంపకం చేయటంపై తాత్సారం జరుగుతున్నా బాబు ఆ విషయం పట్టించుకోకపోవటంపై కూడా విమర్శలు వినబడ్డాయి.

పోలవరం

పోలవరం ప్రాజెక్టును 2018కి పూర్తిచేసి దానిని చూపించి 2019లో ఓట్లు అడుగుదామని బాబు అనుకున్నారు. అయితే అదేమో రాయపాటి వారి ట్రాన్స్ ట్రాయ్ పుణ్యమా అని అది బాగా వెనకబడిపోయింది. ఎస్టిమేట్స్ బాగా పెరిగినప్పటికీ వాటిని పెంచాలని కేంద్రాన్ని అడిగే సాహసాన్ని బాబు ప్రభుత్వం చేయలేకపోయింది. మరోవైపు బాబు పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై దృష్టిపెట్టటంకూడా పోలవరం ఆలస్యానికి కారణాలలో ఒకటని చెప్పొచ్చు. అయితే పట్టిసీమ పనుల్లో ఎన్ని అవకతవకలు ఉన్నప్పటికీ అంతిమంగా రైతులకు ఎంతో కొంత ప్రయోజనం చేకూరటం గుడ్డిలో మెల్లగా చెప్పుకోవాలి. గోదావరి నీళ్ళను పంపులద్వారా కృష్ణా కాలవలలోకి పంపి ఇదే నధుల అనుసంధానం అని, దేశంలోనే మొట్టమొదటిసారి తానే చేశానంటూ ప్రచారం చేసుకోవటంపై తీవ్రవిమర్శలు వ్యక్తమయ్యాయి.

మొత్తం మీద చూస్తే ఆ ఐదేళ్ళలో చంద్రబాబు సమ్మిట్స్, ఈవెంట్స్ అంటూ తిరగటమే ఎక్కువ కనిపించిందిగానీ, తనదైన ముద్ర ఏమీ కనిపించలేదు. కనీసం నాటి జన్మభూమి, శ్రమదానం లాగా విజయవంతమైన కార్యక్రమాలలాంటివి ఒక్కదానిని కూడా నాటి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయింది. దీనంతటికీ కారణం లోకేష్ కోటరీ ప్రభావం బలంగా ఉండటమేనన్న అభిప్రాయం బలంగా ప్రచారంలో ఉండింది. మరి చంద్రబాబు నాటి తప్పులను తెలుసుకుని సరిదిద్దుకుని, అవి పునరావృతం కాకుండా చేసుకుంటారో, లేదో చూడాలి.

ఆ ఐదేళ్ళలో చంద్రబాబు చేసిన విచిత్ర, వివాదాస్పద వ్యాఖ్యలు

నీకూ ఏసీబీ ఉంది నాకూ ఏసీబీ ఉంది - ఓటుకు నోటు కేసు సందర్భంగా కేసీఆర్ ఒక సభలో చంద్రబాబునుద్దేశించి మాట్లాడుతూ, బిడ్డా నిన్ను జైలుకు పంపకుండా బ్రహ్మదేవుడుకూడా ఆపలేడు అన్న వ్యాఖ్యలకు స్పందిస్తూ, నీకూ ఏసీబీ ఉంది, నాకూ ఏసీబీ ఉంది అని చంద్రబాబు అన్నారు. ఆయనలాంటి సీనియర్ పొలిటీషియన్, గొడవలు పడ్డప్పుడు చిన్నపిల్లలు మాట్లాడినట్లు చేసిన ఈ వ్యాఖ్యలు చూసి అందరూ నవ్వుకున్నారు.

నాకు ఉంగరం, వాచీకూడా లేదు, జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు - 2016 ఫిబ్రవరిలో ఒక సందర్భంలో మాట్లాడుతూ, తన వంటిపై ఉంగరం, వాచీ కూడా ఉండవని, జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదని, తనలాంటి వాడిని పట్టుకుని వైసీపీవారు అన్యాయంగా మాటలంటున్నారని బాబు వాక్రుచ్చారు. దేశంలోకెల్లా ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న విషయం తెలిసిందే. అదీకాక రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా బాబుగారు ఎక్కడకు వెళ్ళాలన్నా ఛార్టర్డ్ ఫ్లైట్ లోనే వెళ్ళిన సంగతి కూడా విదితమే. ఆ రోజుల్లో, మాట మాట్లాడితే తాను నిప్పునని బాబు చెప్పేవారు.

ఎస్.సి. కుటుంబంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు - కులాల రిజర్వేషన్లపై మాట్లాడుతూ ఎస్సీ కుటుంబంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని బాబు కృష్ణాజిల్లాలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయి - ఒక ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే బాబుగారి అదృష్టంకొద్దీ, ఆ వ్యాఖ్యలను సాక్షి మీడియామాత్రమే రికార్డ్ చేసిఉండటంతో వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

నేనే సీనియర్ పొలిటీషియన్ - దేశం మొత్తంలోకీ తానే సీనియర్ రాజకీయవేత్తనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమిళనాడులో నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసి 60 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న కరుణానిధి, ఇటుపక్క ఒరిస్సాలో 20 సంవత్సరాలనుంచి ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్, ఇంకా శరద్ పవార్, ములాయం వంటి కురువృద్ధులు ఎందరో ఉన్నా తాను సీనియర్ నని ఎలా అనుకున్నారో బాబుకే తెలియాలి.

భారతదేశంలోని నిర్మాణసంస్థలు మురికివాడలు మాత్రమే నిర్మిస్తాయి - అమరావతి నిర్మాణాన్ని స్విష్ ఛాలెంజ్ విధానంలో కేటాయించటంపై మాట్లాడుతూ, దేశంలోని కనస్ట్రక్షన్ సంస్థలపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది దేశం పరువుతీయటమేనని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.

Read More
Next Story