రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమైన అమరావతి
x
అమరావతిలో రెడీ అయిన పోలీస్ పెరేడ్ గ్రౌండ్

రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమైన అమరావతి

అమరావతిలో పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. పరమనెంట్ గా 20 ఎకరాల్లో ప్రభుత్వం గ్రౌండ్ ఏర్పాటు చేసింది.


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మొదటి సారిగా గ్రాండ్ రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమవుతోంది. 2026 జనవరి 26న జరిగే 77వ గణతంత్ర దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోస్ట్ చేయనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటి సారిగా అమరావతిలో ఈ వేడుకలు జరగడం విశేషం. ఇప్పటి వరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఇకపై పర్మనెంట్‌గా అమరావతిలోనే జరుగుతాయని అధికారులు తెలిపారు.


రిపబ్లిక్ డే పరేడ్ కు రెడీ అయిన గ్రౌండ్

ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ కోసం 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ గ్రౌండ్ రాయపూడి గ్రామంలోని ఎమ్మెల్యే భవన సముదాయం నుంచి హైకోర్టు సముదాయం వరకు విస్తరించి ఉంది. పోలీస్ శాఖ నెలన్నర రోజులుగా గ్రౌండ్ సిద్ధం చేసే పనులు చేపట్టింది. ప్రత్యేకమైన ఎర్రమట్టిని తోలించి, చుట్టూ చిన్న సైజు చిప్స్ సిమెంట్‌తో రోడ్లు ఏర్పాటు చేశారు. గ్రౌండ్ వెనుక భాగం పడమర వైపున సచివాలయ కార్యదర్శుల క్వార్టర్లు, ఉత్తరం వైపున రాష్ట్ర ప్రభుత్వ శాఖల హెడ్ ఆఫీసుల భవనాలు, దక్షిణం వైపున న్యాయమూర్తుల భవనాలు, తూర్పు వైపున మంత్రుల క్వార్టర్లు సిద్ధమయ్యాయి. మంత్రుల క్వార్టర్లకు ఉత్తరం వైపున ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు ఉన్నాయి. చుట్టూ మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయమూర్తుల క్వార్టర్లు ఉండటంతో, ఉదయం పూట వాకింగ్‌కు కూడా ఈ గ్రౌండ్ ఉపయోగపడుతుంది.


ప్రేక్షకులు కూర్చునేందుకు జరిగిన ఏర్పాట్లు

లక్షల రూపాయల ఖర్చుతో వీఐపీలు, అధికారులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు కూర్చుని చూసేందుకు దక్షిణం, పడమర, ఉత్తరం వైపుల్లో లాంజ్‌లు ఏర్పాటు చేశారు. తూర్పు వైపున రెడీమేడ్ మెటీరియల్‌తో గోడలాంటి నిర్మాణాలు, స్టాల్స్ ఏర్పాటు జరిగాయి. విద్యుత్ వెలుగుల కోసం ఎల్‌ఈడీ బల్బులు వేయించారు. సాయంత్రం పూట కల్చరల్ యాక్టివిటీలు నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ డెకరేషన్ పనులు చేపట్టింది.

రిహార్సల్స్ పూర్తి స్వింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ అధికారులతో సమీక్ష నిర్వహించి, ఏర్పాట్లు పర్ఫెక్ట్‌గా ఉండాలని సూచించారు. సెక్యూరిటీ కోసం 900 మంది పోలీసులను మోహరించారు. సెపరేట్ పార్కింగ్ ఏరియాలు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్లాన్, బారికేడింగ్ ఏర్పాటు చేశారు. పరేడ్‌లో ఇండియన్ డాగ్ బ్రీడ్స్ (రాంపూర్ హౌండ్, ముధోల్ హౌండ్ మొదలైనవి), రాప్టర్స్, పోనీలు, కామెల్స్ ప్రదర్శన ఉంటుంది.

ఈ వేడుకలు అమరావతి డెవలప్‌మెంట్‌ను ప్రదర్శించే అవకాశంగా మారాయి. రాష్ట్ర ప్రగతి, ఐక్యతను చాటిచెప్పేలా టాబ్లోలు, కల్చరల్ షోలు, ఫైర్‌వర్క్స్ ఏర్పాటు జరుగుతున్నాయి. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత మొదటి పెద్ద ఈవెంట్ ఇది కావడంతో ప్రజల్లో ఉత్సాహం నెలకొంది.


Read More
Next Story