
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మమతా అనుమానం ఏమిటి?
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?
బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదం(Plane crash)లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) మృతి వెనుక కుట్ర ఉండవచ్చని పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు(Supreme court) పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. బుధవారం (జనవరి 28) ఉదయం ముంబై నుంచి బారామతికి వెళ్తున్న చిన్న విమానం ల్యాండింగ్ ప్రయత్నంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ధృవీకరించింది.
మమత ట్వీట్..
ఈ ఘటనపై ‘X’ (మాజీ ట్విట్టర్)లో మమతా బెనర్జీ స్పందించారు. అజిత్ పవార్ ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయన కుటుంబానికి, ముఖ్యంగా శరద్ పవార్ సహా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంపై సరైన, పారదర్శక దర్యాప్తు అవసరమని ఆమె పేర్కొన్నారు.
‘‘బీజేపీని వీడుతారని తెలిసింది..’’
తరువాత కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో భద్రత పరిస్థితులపై మమతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “దేశంలో ఎవరికీ భద్రత లేదు. అజిత్ పవార్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, ఆయన ఇటీవల బీజేపీని విడిచిపెట్టాలని ఆలోచిస్తున్నారని నాకు సమాచారం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరిగింది” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇతర ఏజెన్సీలపై తనకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టుపైనే విశ్వాసం ఉందని మమతా అన్నారు.
సీఎం కాకుండానే..
66 ఏళ్ల అజిత్ పవార్, రాబోయే నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నాలుగు కీలక బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఆయన ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ బాబాయ్ కాగా, లోక్సభ ఎంపీ సుప్రియా సూలేకు బంధువు. ఆయన భార్య సునేత్ర, కుమారులు పార్థ్ , జే జీవించి ఉన్నారు. అజిత్ పవార్ ఆరుసార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినా, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మాత్రం దక్కలేదు.

