
కోల్కతా స్టేడియంలో మెస్సీ అభిమానుల ఆందోళన..
కుర్చీలు విరగ్గొట్టి, వాటల్ బాటిళ్లను విసిరిన ఫ్యాన్స్..
కోల్కతా(Kolkata) సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ(Lionel Messi) అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మెస్సీని సరిగా చూడలేకపోయామని స్టేడియంలో కుర్చీలను విరగొట్టారు. వాటర్ బాటిళ్లను మైదానంలోకి విసిరేశారు.
‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ లో భాగంగా అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ శనివారం తెల్లవారుజామున కోల్కతాకు చేరుకున్నాడు. ఆయనతో పాటు జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ భారత్కు వచ్చారు. 14 ఏళ్ల తర్వాత భారత్కు వచ్చిన మెస్సిని చూడటానికి విమానాశ్రయానికి అభిమానులు వందల సంఖ్యలో తరలివచ్చారు. అర్జెంటీనా జెండాలను చేతబూని ‘మెస్సి మెస్సి’ అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. కోల్కతాలోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో మెస్సి బృందం బస చేసింది.
శనివారం ఉదయం 11.30 గంటలకు మెస్సీతో పాటు సహచర ఆటగాళ్లు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్తో కలిసి స్టేడియం వద్దకు చేరుకున్నాడు. వారి చుట్టూ నిర్వాహక కమిటీ బృందం గుమిగూడడంతో మెస్సీ దాదాపు 20 నిమిషాల పాటు కనిపించకుండా పోయారు. దీంతో స్టేడియంలో ప్రేక్షకులు "మాకు మెస్సీ కావాలి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో క్రీడాకారుల చుట్టూ భద్రతా సిబ్బంది రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు శాంతంగా ఉండాలని క్రీడామంత్రి అరూప్ బిశ్వాస్, ఈవెంట్ ముఖ్య నిర్వాహకుడు శతద్రు దత్తా మైక్లో కోరినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, క్రికెటర్ సౌరవ్ గంగూలీ వచ్చే ముందు ఉదయం 11.52 గంటలకు మెస్సీని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. మెస్సీని ముందుగానే మైదానం నుంచి బయటకు వెళ్లడం ప్రేక్షకులకు ఆగ్రహాన్ని తెప్పించింది. రూ. 12వేలు చెల్లించి టికెట్ కొన్నా.. ఫుట్బాల్ దిగ్గజాన్ని చూడలేకపోయామన్న వారి కళ్లల్లో కనిపించింది. మెస్సీ కోలకతాకు రావడం ఇది రెండోసారి. 14 సంవత్సరాల క్రితం తొలిసారి వచ్చారు.

